స్తంభించిన రవాణా, బ్యాంకింగ్‌

8 Jan, 2019 11:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన 48 గంటల సమ్మెతో దేశవ్యాప్తంగా రవాణా, బ్యాంకింగ్‌ రంగాలు స్తంభించాయి. సమ్మె కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సమ్మెకు కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ర్యాలీ, రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి.

సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎఐటియుసి, సిఐటియు, ఐఎఫ్ టియు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించాయి.

దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆందోళనలు మిన్నంటాయి. కార్మిక సంఘాల ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేరళలో కార్మిక సంఘాలు రోడ్డెక్కడంతో ప్రజాజీవనం స్తంభించింది. ఒడిశాలోనూ రవాణా వ్యవస్థ స్తంభించింది.

మరిన్ని వార్తలు