సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్కు పార్లమెంటరీ కమిటీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పౌరహక్కుల పరిరక్షణ విషయమై ట్విట్టర్ సీఈవోతోపాటు ఇతర ఉన్నత అధికారులు 15 రోజుల్లోగా తమముందు హాజరుకావాలని అల్టిమేటం జారీ చేసింది. సమాచార సాంకేతికతపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటురీ కమిటీ ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. ట్విటర్ అంతర్జాతీయ విభాగం సీఈవో జాక్ డొర్సేతోపాటు ఉన్నతాధికారులు తమ ముందు హాజురు కావాల్సిందేనని, వారు హాజరయ్యేవరకు ఇతర ట్విటర్ అధికారులను తము కలువబోమని పార్లమెంటరీ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ట్విటర్ ఇండియా ప్రతినిధులు సోమవారం పార్లమెంటరీ కమిటీ ముందు హాజరవ్వడానికి పార్లమెంటుకు వెళ్లినప్పటికీ.. వారిని కలిసేందుకు కమిటీ నిరాకరించింది. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఫేస్బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సంస్థల్లో యూజర్ల డాటా లీక్ కావడాన్ని, ఆ సమాచారాన్ని ఎన్నికల్లో ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉపయోగించుకున్నట్టు కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈమేరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రైట్వింగ్ వాదుల అభిప్రాయల పట్ల ట్విటర్ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై స్పందించిన ట్విటర్.. తమ వేదికపై ప్రజల రాజకీయ అభిప్రాయాల పట్ల ఎలాంటి పక్షపాతమూ చూపించడం లేదని స్పష్టత ఇచ్చింది.