ఢిల్లీ అల్లర్లపై దర్యాప్తునకు సిట్‌ల ఏర్పాటు

27 Feb, 2020 20:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్పై విచారణకు క్రైమ్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్‌) గురువారం ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేశారు. డీసీపీ జాయ్‌ టిర్కీ, డీసీపీ రాజేష్‌ దేవ్‌ల సారథ్యంలో సిట్‌లు దర్యాప్తును చేపడతాయి. ప్రతి బృందంలో నలుగురు ఏసీపీలు, 12 మంది ఇన్‌స్పెక్టర్లు, 16 మంది ఎస్‌ఐలు, 12 మంది హెడ్‌కానిస్టేబుళ్లు ఉంటారు. రెండు సిట్‌ల పనితీరును ఏసీపీ క్రైమ్‌ బీకే సింగ్‌ పర్యవేక్షిస్తారు. ఈశాన్య ఢిల్లీలో మూడురోజులు జరిగిన అల్లర్లకు సంబంధించిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఈ రెండు సిట్స్‌కు బదలాయిస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అల్లర్లపై ఇప్పటివరకూ 48 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. పరిస్థితికి అనుగుణంగా స్పందించడంలో​ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో దర్యాప్తునకు సిట్‌ బృందాలను పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. అల్లర్ల నియంత్రణలో విఫలమయ్యారని ఢిల్లీ పోలీసులను హైకోర్టు బుదవారం తప్పుపట్టిన సంగతి తెలిసిందే.

చదవండి : ఆ కుటుంబాలకు రూ. 10 లక్షలు: కేజ్రీవాల్‌

మరిన్ని వార్తలు