టిక్‌టాక్‌ వీడియో చిత్రీకరణ కోసం నదిలో దూకి..

3 Jul, 2019 13:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : టిక్‌టాక్‌ వీడియో చిత్రీకరణ కోసం ఇద్దరు యువకులు బ్రిడ్జిపైనుంచి ప్రవహిస్తున్న నదిలో దూకిన ఘటనలో ఒకరు క్షేమంగా బయటపడగా మరొకరి ఆచూకీ గల్లంతైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దియోరియా జిల్లాకు చెందిన దనిష్‌, ఆషిక్‌ అనే ఇద్దరు స్నేహితులు సోమవారం సాయంత్రం చోటీ గందక్‌ నది వద్ద ఉన్న బ్రిడ్జిమీదకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత మరికొంతమంది యువకులు వీరితో చేరారు. బ్రిడ్జిపైనుంచి నదిలోకి దూకి ఆ సాహస కృత్యాలను వీడియో చిత్రీకరించి టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేయాలని భావించారు. మొదట దనీష్‌ బ్రిడ్జిపైనుంచి నదిలోకి దూకాడు.

కొద్దిసేపటి తర్వాత ఆషిక్‌ కూడా నదిలో దూకాడు.  ఎంతసేపటికి ఇద్దరు నీటిలోనుంచి బయటకు రాకపోవటంతో బ్రిడ్జిపై ఉన్న యువకులు కేకలు వేశారు. దీంతో అక్కడకు చేరుకున్న కొందరు ఈతగాళ్లు నదిలోకి దూకి దనీష్‌ను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. అయితే ఎంత వెతికినా ఆషిక్‌ ఆచూకీ మాత్రం లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆషిక్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు