ప్రాణాలు తీసిన రూమ్‌ హీటర్‌.. తండ్రితో సహా 3 నెలల చిన్నారి మృతి

23 Dec, 2023 14:58 IST|Sakshi

చలి వణికిస్తోంది. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా చలి తీవ్రంగా ఉంది. ఈ కారణంగా చాలా మంది ఇంట్లో ఉపశమనం కోసం రూమ్ హీటర్లను ఉపయోగిస్తారు.   అయితే రూమ్ హీటర్లు వాడే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా ప్రాణాలకే రిస్క్. ఈ మధ్య కాలంలో హీటర్ల వల్ల కలుగుతున్న ప్రమాదాల గురించి వింటూనే ఉన్నాం. రూమ్ హీటర్లు గాలిలో తేమను తగ్గించగలవు. దీంతో ఆక్సిజన్‌ తగ్గిపోయి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. కొన్నిసార్లు అగ్ని ప్రమాదానికి కారణమై ప్రాణాలు కోల్పోవం వంటి ఘటనలు కూడా జరిగాయి. 

తాజాగా రాజస్థాన్‌లోనూ వాటర్‌ హీటర్‌ ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. హీటర్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఓ తండ్రి, మూడు నెలల చిన్నారి మృత్యువాతపడ్డారు.  భార్య చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఖైర్తాల్-తిజారా జిల్లాలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. దీపక్‌ యాదవ్‌ అనే వ్యక్తి స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో చలిగా ఉందని రూమ్‌ హీటర్‌ ఆన్‌ చేశాడు.

ఈ క్రమంలో హీట్‌ ఎక్కువై ఇంట్లో ఉన్న దూదికి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు చెలరేగడంతో దీపక్‌, అతని మూడు నెలల కుమార్తె నిషిక సజీవ దహనమయ్యారు. భార్య సంజు తీవ్రంగా గాయడింది. వీరి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, దీపక్ మరియు నిషిక మరణించినట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు