45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగిత..!

31 May, 2019 20:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: కేంద్రంలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని నరేంద్రమోదీతో సహా 58 మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఎన్నికల ముందు తయారైన జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) వివరాలు వెల్లడయ్యాయి. సర్వే వివరాలను కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం బహిర్గతం చేసింది. 2017–18 సంవత్సరంలో దేశంలో నిరుద్యోగం రేటు 6.1 శాతంగా ఉందని తెలిపింది. ఇది గడిచిన 45 ఏళ్లలో గరిష్టమని వెల్లడించింది.

గత ఏడాది(2017–18) పట్టణ ప్రాంత పురుషుల్లో 7.8 శాతం, మహిళల్లో 5.3 శాతం నిరుద్యోగంలో ఉన్నారని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా గత ఏడాది (2017–18) పురుషుల్లో 6.2 శాతం, మహిళల్లో 5.7 శాతం నిరుద్యోగిత ఉందని సర్వే పేర్కొంది. ఇక ఎన్నికలకు ముందే పీఎల్‌ఎఫ్‌ఎస్‌ పూర్తయింది. సర్వే వివరాలు కూడా అనధికారికంగా ఫిబ్రవరిలోనే వెల్లడయ్యాయి. అయితే, ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో సర్వే వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. ఈ నివేదిక ముసాయిదా మాత్రమేననీ, దీనిని ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.
(50 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం)

మరిన్ని వార్తలు