కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ కన్నుమూత

12 Nov, 2018 06:18 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నంత్‌కుమార్‌(59) ఆకస్మికంగా కన్నుమూశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన మృతిచెందడం బీజేపీ శ్రేణులను విషాదంలో ముంచెత్తింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అనంత్‌కుమార్‌ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు.. ఆయనకు కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
 

1959 జూలై 22న జన్మించిన అనంత్‌కుమార్‌ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఏబీవీపీలో కీలక పాత్ర పోషించారు. 1996లో తొలిసారి దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి ఆయన ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. అనంత్‌కుమార్‌ వాజ్‌పేయి కేబినెట్‌లో విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో పాటు ఎరువులు, రసాయన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతోపాటు పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంత్‌కుమార్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు