యడ్యూరప్పపై అంటరానితనం ఫిర్యాదు

23 May, 2017 02:09 IST|Sakshi

మండ్య (కర్ణాటక): కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప దళితుల పట్ల అంటరానితనం పాటిస్తున్నారంటూ మండ్య జిల్లాకు చెందిన డి.వెంకటేష్‌ అనే వ్యక్తి ఆ జిల్లా ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కరువు యాత్రలు చేపడుతూ దళితుల ఇళ్లకు వెళ్లి భోజనం చేస్తున్నానని చెప్పుకుంటున్న యడ్యూరప్ప... అక్కడకు హోటల్‌ నుంచి ఆహారం తెప్పించుకుని తింటున్నారని ఆరోపించారు.

తద్వారా దళితుల పట్ల వివక్ష చూపుతూ, వారి ఇళ్లలో భోజనం చేయడం తప్పనే సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నారన్నారు. కరువు యాత్రలు చేపడుతున్న యడ్యూరప్ప ఈ నెల 18న తుమకూరు జిల్లాలోని ఓ దళిత బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లి అక్కడకు హోటల్‌ నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. దీనిపై వెంకటేష్‌ ఎస్పీకి ఫిర్యాదు చేయగా బీజేపీ ఖండించింది. యడ్యూరప్ప వెళ్లేటప్పటికి ఆ ఇంట్లో వండిన ఆహారం అయిపోయినందునే హోటల్‌ నుంచి తెప్పించారని వివరణ ఇచ్చింది.

మరిన్ని వార్తలు