పెళ్లి లోన్లు పెరుగుతున్నాయి.. 

8 Feb, 2020 15:44 IST|Sakshi

బ్యాంకుల్లో పెళ్లికి రుణాలు తీసుకుంటున‍్న ప్రజలు

ఇండియా ల్యాండ్స్‌ సంస్థ సర్వేలో వెల్లడి 

సాక్షి, ముంబై: పెళ్లి అనేది అందరికీ ఒక తీపి జ్ఞాపకం. అందుకే ఖర్చుకు వెనకాడకుండా ధనవంతుల నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలు తమ స్థోమతకు మించి పెళ్లిళ్లను ఘనంగా నిర్వహిస్తుంటారు. దీనికోసం అనవసరమైతే అప్పులు కూడా చేసి ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో పెళ్లి కోసం లోను తీసుకుని వారి సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ముంబైలో వెడ్డింగ్‌ లోన్‌ కోసం చేసుకున్న దరఖాస్తుల సంఖ్య 51 శాతం పెరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో పురుషులతో పోలిస్తే మహిళలే అధికంగా ఉన్నారు. ఈ నెల 9వ తేదీన ప్రపంచ వెడ్డింగ్‌ డే ఉంది. 

ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఇండియా ల్యాండ్స్‌ అనే సంస్థ వెడ్డింగ్‌ లోన్‌ ట్రెండ్స్‌ నివేదిక విడుదల చేసింది. అందులో పెళ్లి కోసం నగలు, పంక్షన్‌ హాల్‌, కేటరింగ్, పెళ్లికి వచ్చే బంధువులు బస చేసేందుకు ఇలా రకరకాల కారణాలతో లోను కావాలని పెళ్లికి మూడు, నాలుగు నెలల ముందే నుంచే దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపింది. లోను కోసం సుమారు రూ.2 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు దరఖాస్తు చేసుకుంటున్నారని వెల్లడించింది. కాగా పర్సనల్‌ లోన్‌ తీసుకునే వారి సంఖ్య 30 శాతం పెరిగింది. పెళ్లి కోసం చేసుకున్న మొత్తం దరఖాస్తుల్లో 22-35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో 42 శాతం మహిళలే ఉన్నారు. దీన్ని బట్టి తమ పెళ్లి భారం తల్లిదండ్రులపై మోపకూడదని ఆడ పిల్లలు భావిస్తున్నట్లు నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. 

>
మరిన్ని వార్తలు