అమిత్‌ షా ర్యాలీకి ఆటంకం

18 Jan, 2019 19:39 IST|Sakshi

కోల్‌కతా : బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఆదివారం నిర్వహించే ర్యాలీకి హాజరయ్యేందుకు మాల్ధా ఎయిర్‌పోర్ట్‌లోని హెలిప్యాడ్‌ను వాడుకునేందుకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. విమానాశ్రయంలో హెలిప్యాడ్‌ ఉపయోగంలో లేదని, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులతో తాత్కాలిక హెలిప్యాడ్‌ను ఉపయోగించడం సాధ్యం కాదని మాల్ధా జిల్లా యంత్రాగం స్పష్టం చేసింది.

హెలిప్యాడ్‌ వాడుకొనేందుకు అనుమతి నిరాకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను పార్టీ స్ధానిక విభాగానికి మాల్ధా అదనపు జిల్లా మేజిస్ర్టేట్‌ శుక్రవారం తెలియచేశారు. కాగా అమిత్‌ షా పర్యటన కోసం హెలిప్యాడ్‌కు బెంగాల్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై బీజేపీ రాష్ట్ర శాఖ మండిపడింది. బీజేపీ నేతలు రాష్ట్రంలో ర్యాలీలు చేపట్టకుండా నిరోధించేందుకు తృణమూల్‌ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించింది.

కాగా రథయాత్రల స్ధానంలో బెంగాల్‌ అంతటా ర్యాలీలు నిర్వహించేందుకు సుప్రీం కోర్టు అనుమతించిన క్రమంలో బీజేపీ మాల్ధాలో ర్యాలీకి సన్నాహాలు చేసుకుంది. అమిత్‌ షా విమానం దిగేందుకు వీలుగా మరో ప్రాంతంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని వార్తలు