‘ఆరెస్సెస్‌’ కేసులో కోర్టుకు..

13 Jun, 2018 01:58 IST|Sakshi

విచారణకు హాజరైన రాహుల్‌

థానే: రాష్ట్రీయస్వయంసేవక్‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్త వేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ కోర్టుకు హాజరయ్యారు. గాంధీజీ హత్య వెనుక  హస్తముందని ఆర్‌ఎస్‌ఎస్‌ భివండీలో 2014లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్‌ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తమ సంస్థకు పరువు నష్టం కలిగించాయంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రాజేశ్‌ కుంతే కేసు వేశారు. ఈ కేసును మంగళవారం విచారించిన భివండీ సివిల్‌ జడ్జి.. ఈ నేరాన్ని మీరు అంగీకరిస్తున్నారా? అని ప్రశ్నించగా లేదని రాహుల్‌ బదులిచ్చారు.

పూర్తిస్థాయి విచారణ ఆగస్టు 10 నుంచి ప్రారంభంకానుంది. తదుపరి విచారణ సందర్భంగా ఫిర్యాదు దారు సమర్పించిన రాహుల్‌ ప్రసంగానికి సంబంధించిన పత్రాలు, వీడియో రికార్డింగ్‌లను సాక్ష్యంగా స్వీకరించాలా వద్దా అనే అంశంపై కోర్టుం తీర్పు చెప్పనుంది. ఈ కేసును కొట్టివేయాలంటూ 2016లో రాహుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక్కరు చేసిన నేరాన్ని సంస్థకు ఆపాదించరాదనీ, తన వ్యాఖ్యలపై రాహుల్‌ పశ్చాత్తాపం వ్యక్తం చేయనందున తదుపరి విచారణను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు తేల్చింది.

గురువు అడ్వాణీనే అవమానించారు
వ్యక్తిగత జీవితంలో గురువు స్థానం ఎంతగొప్పదో హిందూమతం చెబుతుందనీ, అలాంటిది ప్రధాని మోదీ ఏకంగా తన గురువు అడ్వాణీనే అవమానించారని రాహుల్‌ విమర్శించారు. అధికారిక కార్యక్రమాల్లో ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదన్నారు.

మంగళవారం ముంబైలో జరిగిన పార్టీ ర్యాలీలో మాట్లాడారు. ‘మోదీకి గురువు, మార్గదర్శకుడు  అడ్వాణీయే అని అందరికీ తెలుసు. అధికారిక కార్యక్రమాలప్పుడూ మోదీ ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదు. అటల్‌జీ దేశం కోసం పాటుపడ్డారు. ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా మొట్టమొదటిగా నేనే వెళ్లి పరామర్శించా’ అన్నారు.

మరిన్ని వార్తలు