బిందుకు మళ్లీ వేధింపులు

25 Apr, 2019 18:54 IST|Sakshi

తిరువనంతపురం : బిందు.. ఈ ఏడాది జనవరి మాసంలో దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. కారణం శబరిమలలోకి ప్రవేశించిన మొదటి మహిళ కావడం. శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయ్యప్ప ఆలయంలోకి కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) ప్రవేశించిన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆలయ ప్రవేశం అనంతరం బిందు ఎన్నో వేధింపులకు గురయ్యారు. అత్తింటి వారితోపాటు.. ఇరుగుపొరుగు వారి విమర్శలు, బీజేపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తల దాడులు.. ఇలా ఎన్నో అవమానాలు, వేధింపులకు గురిచేసినా ఆమె నిర్భయంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. స్కూల్‌ టీచర్‌గా తన విధులు నిర్వహిస్తూ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే అయ్యప్ప ఆలయ ప్రవేశ వివాదం సద్దుమనిగిందని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఆమెకు వేధింపులు మొదలైయ్యాయి. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆమెను కొంతమంది బీజేపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తలు వేధించారు. ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. నువ్వు బతికి ఉండొద్దు చావుపో అంటూ మెరుపు దాడి చేశారు. తనపై జరిగిన దాడిని సోషల్‌ మీడియా వేదికగా ఖండించారు బిందు. తనపై దాడికి దిగిన వారిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటానని హెచ్చరించారు. 

చదవండి : శబరిమలలో కొత్త చరిత్ర

ఎన్నికల విధుల్లో భాగంగా బిందు రిజర్వ్‌ అధికారిగా పట్టంబి నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడి ఓ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని ఉంచారు. ఆమె విధుల్లో భాగంగా మంగళవారం అక్కడి వెళ్లారు.  అక్కడ కొంత మంది వ్యక్తులు తనను గుర్తించి దాడికి యత్నించారని బిందు పేర్కొన్నారు. తన విధులు ముగించుకొని క్యాంపస్‌కు తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది దాడి చేశారన్నారు. ’  సాయంత్ర సమయంలో క్యాంపస్‌ నుంచి బయటకు వెళ్లాను. అక్కడ నా కోసం ఓ గ్రూప్‌ కాపు కాస్తూ ఉంది. నా దగ్గరకు వచ్చి శబరిమల ఆలయంలోకి వెళ్లింది నువ్వేనా అని ఒకరు అడగ్గా.. నేను సమాధానం చెప్పేలోపే నాపై దాడికి దిగారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ దూషించడం మొదలు పెట్టారు. ’ నువ్వు బతికి ఉండొద్దు.. వెళ్లి చావు’  అంటూ మెరుపు దాడికి యత్నించారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అధికారిపై దాడి జరగడం దారుణం. ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్యానికే సవాల్‌గా మారుతోంది. నాపై దాడికి ప్రయత్నించిన వారిపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా. నా పోరాటాన్ని కొనసాగిస్తా’  అని బిందు పేర్కొన్నారు.

బిందు చిన్నప్పటి నుంచీ రెబల్‌. కాలేజీరోజుల్లో కేరళ విద్యార్థి సంఘటన (వామపక్ష విద్యార్థి సంఘం)నాయకురాలిగా పనిచేశారు. కేరళ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ చేశారు. కమిట్‌మెంట్‌కు మరోపేరు ఆమె. జెండర్‌ ఈక్వాలిటీ, సాంఘిక న్యాయ పోరాటాల్లో ముందున్నారు. ఆ విషయాల మీద ఆమె ఇచ్చే ఉపన్యాసాలు వినడం కోసం కేరళలో స్టూడెంట్స్‌ చెవి కోసుకుంటారు. బిందు వ్యక్తిగత విషయానికి వస్తే ప్రముఖ పొలిటికల్‌ యాక్టివిస్ట్‌ హరిరన్‌ ఆమె భర్త. వాళ్లకు పదకొండేళ్ల కూతురు ఓల్గా. కోజీకోడ్‌ జిల్లాలోని పోక్కాడ్‌ ఆమె నివాసం.

>
మరిన్ని వార్తలు