ఉత్తరాఖండ్ బాధితులు పడుతున్న బాధలను రాష్ట్రపతికి దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్ సీపీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. తెలుగువారిని రక్షించాలని కోరామని చెప్పారు. వైఎస్సార్ సీపీ నేతలతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆయన కలిశారు. ఉత్తరాఖండ్ వరద బాధితులను రక్షించాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ... వరదల్లో మరణించినవారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాతో పాటు, మృతుల కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో విఫలమయిందని మేకపాటి ఆరోపించారు. ఉత్తరాఖండ్ వరద బాధిత ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ తరఫున వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని చంద్రబాబు సొమ్ముచేసుకోవాలని, వరదల ద్వారా రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాడని విమర్శించారు. ఉత్తరాఖండ్ ఉపద్రవాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మేకపాటి కోరారు. వరద బాధితులకు తమ పార్టీ తరపున అందిస్తున్న వైద్య సేవలను రాష్ట్రపతి ప్రశంసించారని మైసూరారెడ్డి వెల్లడించారు.