120 గంటలుగా సొరంగంలోనే.. కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన

17 Nov, 2023 10:12 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోసొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. ప్రమాదం జరిగి అయిదు రోజులు కావొస్తుంది. గత 120 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 40 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు ఒక్క కార్మికుడు కూడా సురక్షితంగా బయటకు రాలేకపోయారు. దీంతో సొరంగం లోపల బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న కార్మికుల ఆరోగ్యం, క్షేమంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది.

ఇప్పటి వరకు 24 మీటర్ల వరకు శిథిలాలను రక్షణ బృందాలు తొలగించారు. నాలుగు పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్‌, నీరు, ఆహారం అందిస్తున్నారు. థాయ్‌లాండ్‌, నార్వేకు చెందిన ఎలైట్‌ రెస్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీటిలో 2018లో థాయ్‌లాండ్‌లోని గుహలో చిక్కుకున్న పిల్లలను విజయవంతంగా రక్షించిన రెస్యూటీమ్‌లు కూడా ఉన్నాయి.

50 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పైపులను శిథిలా గుండా సొరంగంలోకి పంపిస్తున్నారు. దీనిద్వారా కార్మికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కూలిపోయిన సొరంగం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్యాలిసౌర్ విమానాశ్రయానికి ‘అమెరికన్ ఆగర్’ మిషన్‌ (విడదీసిన భాగాలు) చేరుకుంది. కూలిపోయిన సొరంగం నుంచి శిథాలల గుండా మార్గాన్ని తవ్వడానికి ఈ యంత్రం ఉపయోగించనున్నారు. ఇది గంటకు 5 మీటర్ల బండరాళ్లను తొలగిస్తుంది,.

కాగా నవంబర్‌ 12న (ఆదివారం) ఉదయం ఉత్తరకాశీలో చార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సిల్క్యారా టన్నెల్‌లో కొంతభాగం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈఘటనలో సొరంగం పనిచేస్తున్న 40 మంది కార్మికులు శిథిలాల మధ్య చిక్కుకుపోయారు. సొరంగం ప్రవేశ ద్వారం నుంచి 200 మీటర్ల దూరంలో వారంతా చిక్కుకుపోయారు. శిథిలాలు ముందు 50 మీటర్ల వరకు పడిపోయాయి. గత నాలుగు రోజులుగా వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

మరోవైపు సొరంగంలో చిక్కుక్ను కార్మికుల ఆరోగ్యంపై వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి మనుగడ, భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారినట్లు చెబతుఉన్నారు. సుదీర్ఘకాలంగా నిర్బంధంలో ఉండటం వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతారని మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఆక్సిజన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు వంటి పరిసర పరిస్థితులు వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని తెలిపారు. భూగర్భంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల అపస్మారక స్థితికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. నిర్మాణంలోని వస్తువులు తమపై పడటం వల్ల తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. వారిని బయటకు తీశాక కూడా సమగ్ర పునరావాసం అవసరమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు