జీతం అడిగితే.. గెంటేశారు!

8 Nov, 2019 12:57 IST|Sakshi

ఒమన్‌లోని డాల్ఫిన్‌ కంపెనీలో ఉద్యోగాల కోత

ప్రశ్నిస్తే వీసాలను రద్దు చేసిన యాజమాన్యం

ఇళ్లకు చేరుకున్న పలువురు తెలంగాణ కార్మికులు

విదేశాంగ శాఖ చర్యలు చేపట్టాలని వినతి

ఎన్‌.చంద్రశేఖర్, మోర్తాడ్‌ (నిజామాబాద్‌ జిల్లా): ఇప్పటి వరకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించిన ఆ కంపెనీ ఇప్పుడు కార్మికుల తగ్గిం పు చర్యలు చేపడుతోంది. ఒమాన్‌ రాజధాని మస్కట్‌లో రేడియేటర్లు తయారు చేసే డాల్ఫిన్‌ కంపెనీ ఎంతో మంది విదేశీయులకు వీసాలు జారీచేసి ఉపాధి కల్పించింది. కార్మికులకు, ఉద్యోగులకు వారి పనినిబట్టి నెలకు 150 రియాళ్ల నుంచి 450 రియాళ్ల వరకు వేతనం చెల్లించడానికి అంగీకరించింది. దీంతో తెలం గాణ జిల్లాలకు చెందిన కొందరు టెక్నీషియన్‌లు రూ.60 వేల నుంచి రూ.70 వేలను వీసాల కోసం చెల్లించారు. ఒమాన్‌లో వాడీకబీర్, గాలా శాఖలలో పని కల్పించింది.

మొదట్లో సక్రమంగా వేతనం..
కంపెనీలో పనికి కుదిరిన తరువాత ప్రతి నెలా సక్రమంగా వేతనం ఇచ్చిన యాజమాన్యం ఆ తరువాత మూడు, నాలుగు నెలకు ఒకసారి వేతనం ఇచ్చింది. దీనిపై ప్రశ్నించిన కార్మికులను ఇబ్బందులకు గురిచేసిందని పలువురు ఆరోపించారు. అలాగే కార్మికులకు ఉన్న వృత్తి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కూలీలు చేసే పనిని కూడా తమకు అప్పగిస్తున్నారని పలువురు తెలంగాణకు చెందిన కార్మికులు చెప్పారు. కంపెనీ నిర్వహణ లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. సరిగా పనిలేకపోవడం, వేతనం ఆశించిన విధంగా చెల్లించకపోవడంతో ఇంటికి వెళ్తామని అంటే..  మొదటగా వీసాకు చెల్లించిన ఖర్చులన్నీ తిరిగి చెల్లించి వెళ్లిపోవాలని చెప్పారని వెల్లడించారు. వీసా ఒప్పందం ప్రకారం ఇంటికి వెళ్లే సమయంలో ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకపోయినా కంపెనీ యాజమాన్యం మొండిగా వ్యవహరించడంతో తాము ఆర్థిక భారం భరించామని కార్మికులు తెలిపారు. కంపెనీ నుంచి ఇంటికి వచ్చినందుకు డాల్ఫిన్‌ కంపెనీ యాజమాన్యానికి రూ.60వేల వరకు జరిమానా చెల్లించడంతో పాటు విమాన చార్జీలు సొంతంగానే పెట్టుకున్నామన్నారు. ఇప్పటికి కొంత మంది కార్మికులు కంపెనీ యాజమాన్యం సరైన వసతి, భోజనం అందించక పోవడంతో కార్మికులు ఎంతో అవస్థలు పడుతున్నారని వివరించారు. కాగా  గడు వుకంటే ముందు వెళ్లిపోతే అక్కడి నిబంధనల ప్రకారం కాగా  గడువుకంటే ముందు వెళ్లిపోతే అక్కడి నిబంధనల ప్రకారం రెండు సంవత్స రాల పాటు ఆ దేశానికి వెళ్లే అవకాశం ఉండదు.

బలవంతంగా పంపించారు
ఒమాన్‌లోని డాల్ఫిన్‌ కంపెనీ యాజమాన్యం మమ్మల్ని బలవంతంగా గెంటేసింది. టెక్నికల్‌గా ఎంతో అనుభవం ఉన్న వారిని సాంకేతిక పనులపై వినియోగించుకోకుండా కార్మికులుగా ఉపయోగించుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇంటికి వెళ్లిపోవాలన్నారు. అంతేకాకుండా మా నుంచి బలవంతంగా జరిమానా వసూలు చేశారు. కంపెనీ యాజమాన్యంపై ఇండియన్‌ ఎంబసీలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. కంపెనీపై ఒమాన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకునేలా మన విదేశాంగ శాఖ ఒత్తిడి తీసుకురావాలి.     – మల్లూరి భూమన్న,పాలెం (నిజామాబాద్‌ జిల్లా)

మాకు అన్యాయం చేశారు..
ఒమాన్‌లోని డాల్ఫిన్‌ కంపెనీ మాకు అన్యాయం చేసింది. కంపెనీ తీరు సరిగా లేదు. కంపెనీపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ జిల్లాల కార్మికులను వంచించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇళ్లకు చేరుకున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పించాలి.– ద్యావల లింగన్న,కొత్తపేట్‌ (జగిత్యాల జిల్లా)

మరిన్ని వార్తలు