అక్టోబర్ 12, 13న సింగపూర్‌లో తిరుమల శ్రీవారి కల్యాణం

30 Sep, 2019 15:00 IST|Sakshi

సింగపూర్‌లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సమన్వయంతో అక్టోబర్ 12,13న అత్యంత వైభవంగా శ్రీనివాస కల్యాణమహోత్సవం నిర్వహించేందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కల్యాణోత్సవానికి శ్రీవారు, శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల నుండి సింగపూర్‌వాసులను కరుణించడానికి రానున్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్ధానాలకు చెందిన అర్చకులు, వేదపండితులు తిరుమల క్షేత్రం నుంచి వచ్చి సింగపూర్లో ఆ శ్రీవారి కళ్యాణోత్సవాన్ని, ఇతర కైంకర్య సేవలను తిరుమలలోలానే శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇటువంటి సేవలు సింగపూర్‌లో నివసించే అందరికీ, తిరుమల వెళ్ళలేని వారికి కూడా ఇవి అందుబాటులో ఉండేలా, అందరినీ తరింపచేయాలనే సదుద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్ధానాల చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, తుడా ఛైర్మన్, టీటీడి బోర్డ్ సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇతర దేవస్ధాన అధికారులు, సిబ్బంది ఈ వేడుకలకు హాజరుకానున్నారు. గేలాంగ్ ఈస్ట్ అవెన్యూ 2, శ్రీ శివన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ఓపెన్ లాన్స్ ఈ మహోత్సవానికి వేదిక కానుంది. దేదీప్యమానంగా జరగనున్న ఈ వేడుకలో భక్తజనం అందరూ పాల్గొని కనులారా తిలకించి, తరించి, తీర్ధప్రసాదాలు, తిరుపతి లడ్డుప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని సింగపూర్ తెలుగు సమాజం కోరింది. 

మరిన్ని వార్తలు