న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

3 Apr, 2018 15:41 IST|Sakshi

ఆక్లాండ్ :  తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(ట్యాంజ్) ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆక్లాండ్‌లోని మౌంట్ రాస్కిల్ వార్ మెమోరియల్ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హానరరీ ఇండియన్ హై కమిషన్ అఫ్ న్యూజిలాండ్ భావ్ దిల్లోన్, ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భికూ బాణాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐలతోపాటు ఇతర రాష్ట్రాల వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 


ఉగాది వేడుకల్లో భాగంగా ఉగాది ప్రాముఖ్యతను ఉమా రామారావు రాచకొండ వివరించగా, ఆచార్య సందీప్ కుమార్ ప్యారాక పంచాంగ శ్రవణం చేశారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పలు సంస్కృతిక, నృత్య ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. వండర్ గర్ల్స్, తెలంగాణ హార్ట్ బీట్‌ గ్రూప్స్ ఆధ్వర్యంలో చేసిన డ్యాన్స్‌, ఫ్యాషన్ షోలు ప్రేక్షకులను ఉర్రుతలూగించాయి. కార్యక్రమానికి విచ్చేసిన అందరికి ఉగాది పచ్చడితో పాటు, తెలంగాణ శాఖాహార విందును ప్రసన్న, గిరిధర్, శ్రీహరి ఏర్పాటు చేశారు. 


ట్యాంజ్ అధ్యక్షుడు కళ్యాణ్ రావు కాసుగంటి ఉగాది కరదీపికలు ముద్రించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ఉగాది సంబురానికి విచ్చేసిన అతిథులకు పుస్తకాలను అందించడానికి సహకరించిన తెలంగాణ సంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ మామిడికి, టీఆర్‌ఎస్‌ న్యూజిలాండ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కోసినకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలుగు ప్రపంచ మహాసభలు జరపడం, తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చెయ్యడం గొప్ప పరిణామమని తెలిపారు. అలాగే తెలుగును న్యూజిలాండ్‌లో ప్రోత్సహించేందుకు వీలుగా ఇండియన్ అసోసియేషన్ టాగోర్ లైబ్రరీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, భాష, యాస సూచికలైన పలు పుస్తకాలను ఉంచబోతున్నట్టు వెల్లడించారు. తెలుగును రెండవ భాష ఆప్షన్‌గా పాఠశాలలో భోధించేలా న్యూజిలాండ్ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమం ట్యాంజ్ కోర్ అడ్వైజర్‌ నరేందర్ రెడ్డి పటోళ్ల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ట్యాంజ్ కార్యవర్గ సభ్యులు నర్సింగ రావు పట్లొరి, విజేత రావు, రామ రావు రాచకొండ , జగన్ రెడ్డి వాడ్నలా, రామ్మోహన్ దంతాల, రామ్ రెడ్డి తాటిపత్రి, వినోద్ రావు ఎర్రబెల్లి , సురేందర్ రావులు తమ వంతు కృషి చేశారు.

మరిన్ని వార్తలు