అసెంబ్లీ : టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

17 Dec, 2019 17:40 IST|Sakshi

సాక్షి, అమరావతి : అంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల నుంచి తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. సభకు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారనే కారణంగా ఒక్క రోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నానని స్పీకర్‌ ప్రకటించారు. ఏపీ రాజధానిపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రసంగానికి టీడీపీ సభ్యలు అడ్డు తగిలారు. ఈ క్రమంలో బుగ్గన జోక్యం చేసుకొని, వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు.

దీంతో 9 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. సభ నుంచి ఆ తొమ్మిది మంది బయటకు వెళ్లాలని స్పీకర్‌ సూచించారు. సస్పెండ్‌ అయిన వారిలో నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బెందలం అశోక్, గద్దె రామ్మోహన్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, ఏలూరి సాంబ శివరావు, బాల వీరంజనేయులు, అనగాని సత్య ప్రసాద్, మద్దల గిరి ఉన్నారు.

సభను అడ్డుకోవడం సరికాదు : తమ్మినేని
టీడీపీ సభ్యులను ఉద్దేశ్యపూర్వకంగా సస్పెండ్ చేయలేదని.. ప్రతి చిన్న దానికి పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేయడం సరికాదని స్పీకర్ తమ్మినేని అన్నారు. రాజధానిపై మంత్రులు వాస్తవాలను చెబుతుంటే టీడీపీ సభ్యులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు. నిజాలు బయటపడుతున్నందుకే టీడీపీ సభ్యులు సభను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై మనస్థాపానికి గురయ్యానని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశానని తమ్మినేని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు