రిప్లై ఇవ్వకపోతే పరువు నష్టం దావా వేస్తా

4 Jul, 2018 17:26 IST|Sakshi

అమరావతి: తనను దూషించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులకు నోటీసులు పంపానని, రిప్లై ఇవ్వకపోతే పరువు నష్టం దావా వేస్తానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రత్యేక ప్యాకేజీ తాము అడగలేదని, అందులో 90:10 నిష్పత్తిలో నిధులు అడిగినట్లు ఎక్కడుందో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. సాగరమాల ప్రాజెక్టులో ఇప్పటి వరకు రూ.5 కోట్లు మాత్రమే ఇచ్చారని, కానీ రూ.1800 కోట్లు ఇచ్చినట్లు అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు. సాగరమాల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టిందని అన్నారు. బీజేపీ జుమ్లా పార్టీ, జోకర్స్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు.

ఏపీకి ఇచ్చింది రూ.82 కోట్లు మాత్రమేనని తెలిపారు. రూ.12 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ప్రత్యేక ప్యాకేజీ కంటే ముందే ఇచ్చినవని, రూ.17 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు అదనపు ప్రాజెక్టుల ప్రతిపాదనలని వివరించారు. ఎన్‌డీఏ నుంచి బయటికొచ్చాక ప్రధాని నోరు ఎందుకు విప్పడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతలవి అబద్ధాలు కాబట్టే ప్రధాని మాట్లాడటం లేదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్‌లు ఎవరి దగ్గరకు బ్రోకర్లను పంపారో జీవీఎల్‌ నరసింహారావు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రమే మా దగ్గరకు కన్సల్టన్సీ బ్రోకర్లను రిఫైనరీ ప్రాజెక్ట్‌ కోసం పంపారని ఆరోపించారు.
 

మరిన్ని వార్తలు