ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ వేదికగా బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాము శివసేనను మోసం చేశామని ఆ పార్టీ నేత, మాజీ ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంతివార్ అంగీకరించారు. తాము సేనను మోసం చేశామని అయితే బీజేపీ-సేన మళ్లీ కలిసినడుస్తాయని జోస్యం చెప్పారు. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు తరహాలో బీజేపీ-శివసేన మళ్లీ ఒక్కటిగా సాగుతాయని అన్నారు. రాష్ట్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా ఎన్సీపీ నేత అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చదవండి : ‘బీజేపీ పగటికలలు నెరవేరవు’
మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోకపోవడం ద్వారా బీజేపీ తప్పు చేసిందని ఆయన పేర్కొన్నారు. తాము ప్రభుత్వ ఏర్పాటుకు వెనుకడుగు వేయడంతో ఎన్సీపీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుందని సుధీర్ అన్నారు. తమ తప్పును తెలుసుకుని తిరిగి రెండు పార్టీలు కలిసే సమయం ఎంతో దూరంలో లేదని, తమ కలయికను సులభతరం చేసేలా మహారాష్ట్రలోనూ జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ఎన్సీపీ అనుబంధం మూడునెలలని, బీజేపీ-సేన మధ్య బంధం మూడు దశాబ్ధాల నాటిదని అన్నారు. అయితే తాను వ్యంగ్య ధోరణిలోనే ఈ వ్యాఖ్యలు చేశానని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన వివరణ ఇచ్చారు.