నేటి నుంచి బీజేపీ జాతీయ మండలి

11 Jan, 2019 05:13 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా నేటి నుంచి రెండ్రోజుల పాటు జాతీయ మండలి సమావేశాలను నిర్వహించనుంది. ఢిల్లీలోని రాంలీల్‌ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 7,000 మందికిపైగా పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇటీవల రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి పార్టీ కేడర్‌ కోలుకోవడంపై అధిష్టానం దృష్టి సారించనున్నారు.

ఉపాధ్యక్షులుగా ముగ్గురి నియామకం..
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్, రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌లను పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించింది. ఇటీవల జరిగిన ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వీరి నాయకత్వంలో బీజేపీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో ఈ ముగ్గురు నేతలను బీజేపీ జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు