సిద్దిపేట లేదా రంగారెడ్డిలో సమావేశం
హాజరుకానున్న కేంద్రమంత్రి స్మృతిఇరానీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న బీజేపీ మహిళా సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం ఇక్కడ జరిగిన బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు 20 వేల మంది మహిళలతో సిద్దిపేట జిల్లాలోని చేగుంట లోగాని రంగారెడ్డి జిల్లాలోగాని సమావేశం నిర్వహిం చనున్నట్లు వెల్లడించారు. ఈ సమ్మేళనానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరవుతారని, మహిళలు బీజేపీ వెంట ఉన్నారని చూపించాల్సిన సమయం ఇదేనన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచన మేరకు మహిళా సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని నమ్మి ఓట్లేస్తే, కారణం లేకుండా అసెంబ్లీని 9 నెలల ముం దే రద్దు చేశారన్నారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడుగనన్న కేసీఆర్ అది ఇప్పట్లో అమ లు చేయలేరు కాబట్టే ముందస్తుకు వెళ్లారన్నారు. డబుల్బెడ్ రూమ్ ఇళ్ల శాంపిల్స్ మాత్రమే నిర్మించారని, 2 లక్షల ఇళ్లు ఎక్కడా కట్టలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతి జరిగిందని, విచారణ జరిపిస్తామన్న కేసీఆర్ ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు.
లోపాయకారిగా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒప్పందం చేసుకొని, ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప విచారణ సాగడంలేదన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ‘ప్రధాని ఆవాస్ యోజన’ నిధులు దారి మళ్లించారని, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం వల్ల మోదీకి పేరు వస్తుందన్న అక్కసుతోనే కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. పరీక్షల్లో పుస్తెలు, మెట్టెలు తీయించి హిందూ సంçస్కృతిని అవమానించడంపట్ల మహిళాలోకం ఆగ్రహంతో ఉందన్నారు. ధర్నాచౌక్ విషయంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అని అన్నారు. ఎన్నికల్లో మహిళలకు అధిక సీట్లు ఇవ్వాలని లక్ష్మణ్ను మహిళామోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ కోరారు.