అభివృద్ధి లేకనే వ్యక్తిగత ఆరోపణలు : బొత్స

30 Mar, 2019 20:04 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ది కార్యక్రమం చేయలేదు కాబట్టే టీడీపీ నేతలు తమపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..  ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఈ ప్రాంత ఎంపీ అశోక్ గజపతి రాజు సహా అధికార పార్టీ నేత లెవరూ రాష్ట్రానికి హొదాతో పాటు ముఖ్యంగా వెనుక బడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావాల్సిన నిధులు గురించి పోరాటం చేయకపోవడం దారుణమాన్నారు. గ్రామాల్లో విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమం​త్రి కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

రాచరికం నుంచి నేరుగా రాజకీయాల్లోకి రాలేదు : బొత్స
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లో సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగిన తనపై ఆరోపణలకు చేయడానికి టీడీపీ నేతలకు అర్హత లేదన్నారు. తాను తప్పు చేస్తే విచారణ జరిపించాలని సవాల్‌ చేస్తే ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు ఊరికే గుడ్డ కాల్చి మొహం మీద వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాను సామాన్య కుటుంబం రాజకీయాల్లోకి వచ్చి ఈ స్ధాయికి ఎదిగామే తప్ప.. రాచరికం నుంచి నేరుగా రాలేదంటూ అశోక్ గజపతిరాజు పై పరోక్ష విమర్శలు చేశారు.

మరిన్ని వార్తలు