మొహాలి: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు కింగ్స్ పంజాబ్ షాకిచ్చింది. ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కింగ్స్ లక్ష్య ఛేదనలో క్రిస్ గేల్(40; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మంచి ఆరంభాన్నివ్వగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(71నాటౌట్; 57 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) కడవరకూ క్రీజ్లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వీరిద్దరికి తోడుగా మయాంక్ అగర్వాల్(43; 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో కింగ్స్ పంజాబ్ 18.4 ఓవర్లోనే గెలుపొందింది.
అంతకుముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. డీకాక్(60: 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి జతగా, రోహిత్ శర్మ(32: 19 బంతుల్లో 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా(31: 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు ఫర్వాలేదనిపించడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబైకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డీకాక్లు ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించారు. వీరిద్దరూ 5.2 ఓవర్లు ముగిసే సరికి 51 పరుగులు చేసిన తర్వాత రోహిత్ తొలి వికెట్గా ఔటయ్యాడు. ఆపై సూర్యకుమార్ యాదవ్(11) నిరాశపరచడంతో ముంబై ఇండియన్స్ 62 పరుగుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది. ఆ తరుణంలో డీకాక్-యువరాజ్ సింగ్ల జోడి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. ఈ జోడి 58 పరుగులు జత చేసిన తర్వాత డీకాక్ మూడో వికెట్గా పెవిలియన్ చేరగా, మరో ఆరు పరుగుల వ్యవధిలో యువీ(18) కూడా ఔటయ్యాడు.కాసేపటికి పొలార్డ్(7) పెవిలియన్ బాటపట్టాడు. కాగా, చివర్లో హార్దిక్ పాండ్యా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, విల్జోయిన్, మురుగన్ అశ్విన్ తలో రెండు వికెట్లు సాధించగా, ఆండ్రూ టై వికెట్ తీశాడు.