మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

20 Jan, 2020 16:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్‌ నాయకులు సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో  మంత్రి మల్లారెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారన్న క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రాంమోహన్ రెడ్డి  ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడ్డ మంత్రి మల్లారెడ్డిని తక్షణం మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సుమోటోగా  తీసుకొని  విచారణ జరిపించాలని సూచించారు.(ఎంపీ అర్వింద్‌కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సవాల్‌)

ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవాలని చూసిన మంత్రి మల్లారెడ్డిపై.. అలాగే టికెట్లు కొనుక్కోవాలని చూసిన అభ్యర్థులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అంటున్న కేసీఆర్, కేటీఆర్‌లు.. మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజల బలహీనతలే పెట్టుబడిగా .. డబ్బు, మద్యం , ప్రలోభాలతో టిఆర్ఎస్ ప్రతిసారి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థగా మార్చిన టిఆర్ఎస్‌ను ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలని సామ రాంమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

చదవండి: కలకలం రేపుతున్న మల్లారెడ్డి ఆడియో టేపు

మరిన్ని వార్తలు