అది కుల రాజకీయం కాదా: శ్రీకాంత్‌ రెడ్డి

16 Apr, 2020 14:25 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప : రేషన్‌ కార్డులు లేని వారికి కూడా బియ్యం అందించడమే కాకుండా మూడు రోజుల్లో శాశ్వత కార్డులు అందిస్తున్నామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడూ రెండడుగులు ముందే ఉండే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. క్వారంటైన్‌ నుంచి డిశ్చార్జ్‌ అయినవారికి రూ.2 వేలు చెల్లించడం అభినందనీయమన్నారు. గురువారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందడం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఇష్టం లేదని విమర్శించారు. తల్లిదండ్రుల కమిటీలు 99శాతం ఇంగ్లీష్‌ మీడియాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. (‘లాక్‌’ మీకు.. దొడ్డిదారి మాకు..! )

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించడం చంద్రబాబు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. తమ పిల్లలు విదేశాలకు వెళ్లి ఇంగ్లీష్‌ మీడియం చదవాలి కానీ బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీష్‌ చదవకూడదా అని సూటిగా ప్రశ్నించారు. జపాన్‌ అభివృద్ధి చెందింది, జపాన్‌ భాషా నేర్చుకో అని చెప్పే చంద్రబాబు ఇంగ్లీష్‌ను మాత్రం అడ్డుకోవడం విడ్డూరమన్నారు. కులం జోలికి వస్తే లేపేస్తామని ఓ మాజీ ఎంపీ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారని, .... లేపేసే ధైర్యం ఉంటే రోడ్డుపైకి రావాలని సవాల్‌ విసిరారు. కత్తులు పట్టుకొని దోమలు, ఎలుకలపై యుద్ధమంటూ ప్రచారం చేసుకొని దోమకు రూ.5 వేలు, ఎలుకలకు రూ10 వేలు చొప్పున కాజేసే ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రూ. 60 వేల కోట్లు పెండింగ్‌లో పెడితే.. జగన్‌ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కింద రూ. 200 కోట్లు విడుదల చేశారని ప్రస్తవించారు. (2020 చివరి నాటికి వ్యాక్సిన్‌ కనుగొంటేనే.. )

ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో సామాజిక దూరం పాటించాలి కానీ సామాజిక కులాలను విడదీసే భయంకరమై వ్యాధిని తెస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ రాసిన లేఖలో ఫ్యాక్షనిస్టు రాజ్యమని రాయడం..కుల రాజకీయం కాదా అని నిలదీశారు. రాజధానుల వికేంద్రీకరణ విషయంలో వ్యతిరేకించారని, కియాపై ఆరోపణలు చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమకు కులమతాలు అవసరం లేదని, ప్రజల తరపున నిలబడి.. సామాజిక న్యాయం చేసి తీరుతామన్నారు. దేశంలో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. తెలుగు మహాసభలు నిర్వహించిన ఘనత మహానేత దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. (మనం ఇంట్లో ఉంటే.. వారు మాత్రం..: మహేశ్‌బాబు )

మరిన్ని వార్తలు