ఆ విషయం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు : గడికోట

28 Jan, 2020 16:45 IST|Sakshi

కర్నూలులో హైకోర్టు అవసరంలేదని చెప్పగలరా?

ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది

వికేంద్రీకరణపై టీడీపీ వైఖరి చెప్పాలి : గడికోట

సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రలో రాజధాని అవసరంలేదని చెప్పే ధైర్యం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి ఉందా అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. వెనుకబడిన కర్నూలులో హైకోర్టు అవసరంలేదని బహిరంగంగా చెప్పగలరా అని సవాల్‌ విసిరారు. మంగళవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీకాంత్‌ రెడ్డి.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలి రద్దుకు టీడీపీ వ్యతిరేకమైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. వికేంద్రీకరణ, 13 జిల్లాల అభివృద్ధిపై టీడీపీ వైఖరి  ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దిశ చట్టంను దేశ వ్యాప్తంగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. (కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం)

‘అసత్యాలు ప్రచారాలు చేస్తూ.. ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్. ఆయనలా దిగజారి మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డొస్తోంది. ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం దుర్గగుడి ఫ్లై ఓవర్ కూడా పూర్తి చేయలేని చంద్రబాబు రాజధానిని ఎలా నిర్మించగలరు?. ప్రభుత్వ నిర్ణయంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు దావోస్‌కు ఎందుకు వెళ్లారో చెప్పాలి. స్విస్‌ బ్యాంక్‌లో దాచుకున్న అక్రమ సొమ్ము కోసమే వెళ్లారు. ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు చరిత్ర ఎలాంటిదో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు రాసిన పుస్తకం చూస్తే తెలుస్తుంద’ని శ్రీకాంత్‌ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

మరిన్ని వార్తలు