నన్ను అద్వానీలా చూడకండి : వీరభద్ర సింగ్‌

14 Jul, 2018 15:41 IST|Sakshi
వీరభద్ర సింగ్‌ (ఫైల్‌ ఫోటో)

సిమ్లా : బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌.కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిలా తనను చూడొద్దని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి తరువాత మొదటిసారి పార్టీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు సుఖ్వీందర్‌ సింగ్‌తో కలిసి పాల్గొన్నారు. సిమ్లాలో శనివారం నిర్వహించిన సమావేశంలో వీరభద్ర సింగ్‌ మాట్లాడుతూ..‘అద్వానీలా కేవలం పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వడానికే లేను. ప్రజల్లోకి వెళ్లడానికి ఇప్పటికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా వెళ్లగలను. వయసు రిత్యా కొందరూ నన్ను అద్వానీ, మురళీమనోహర్‌ జోషిలా కేవలం మార్గదర్శకుడిలా మాత్రమే చూస్తున్నారు. వారి కలలను ఎప్పటికీ సకారం చేసుకోలేకపోయారు. త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యువకుడిలా పార్టీకి సేవచేస్తా’ అని వ్యాఖ్యానించారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరభద్రసింగ్‌కు, పీసీసీ అధ్యక్షుడు సుఖ్వీందర్‌ సింగ్‌ మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. సరైన అభ్యర్థులకు సీట్లు కేటాయించకపోవడం మూలంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, కొంత మంది అసమర్థ నేతల వల్ల పార్టీకి  నష్టం జరిగిందని వీరభద్ర సింగ్‌ అన్నారు. రాష్ట్రంలో నూతన విద్యాసంస్థలు, ఆసుపత్రులు నిర్మించడంలో విఫలమైయ్యామని ఓటమికి అది కూడా కారణమని సుఖ్వీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు