సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం జనసేన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చర్యల్లో భాగంగా పార్టీని స్థానికంగా బలోపేతం చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. దీనిలో భాగంగా పొలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, క్రమశిక్షణా సంఘాన్ని ఏర్పాటు చేసింది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా నాదేండ్ల మనోహర్ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.
నాదేండ్ల మనోహర్తో పాటు రామ్మోహన్ రావు, రాజు రవితేజ్, అర్హంఖాన్లకు జనసేన పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. అయితే పొలిట్ బ్యూరోలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు అవకాశం కల్పించకపోవడం గమనార్హం. దీనిపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక 11 మంది సభ్యులతో కూడిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులను కూడా జనసేన అధినేత ఎంపిక చేశారు. పవన్ అన్నయ్య, నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొణిదెల నాగబాబుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అవకాశం కల్పించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా మాదాసు గంగాధరంను నియమించారు.
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు : తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్, కొణిదెల నాగబాబు, కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలసి యశస్విని, పసుపులేటి యశస్విని, పసుపులేటి హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, భరత్ భూషణ్, బి. నాయకర్.