ఉద్యోగాలొచ్చిన పిల్లల్ని అవమానిస్తారా 

3 Oct, 2019 05:14 IST|Sakshi

చంద్రబాబుపై ఎమ్మెల్యే జోగి రమేశ్‌ ఫైర్‌ 

గాంధీ జయంతినాడు మద్యం ఎక్కడమ్మారో నిరూపించాలని సవాల్‌ 

సాక్షి, అమరావతి: బడుగు బలహీనవర్గాలకు చెందిన పిల్లలు కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే.. వారు రూ.లక్షలు పోసి ఉద్యోగాలు కొనుక్కున్నారని అవమానిస్తున్నారా అని చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ మండిపడ్డారు. ఉద్యోగాలు సాధించిన పిల్లలను చంద్రబాబు అభినందించాలే తప్ప అవమానించ కూడదని హితవు పలికారు. రాజకీయ పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీలు రాజకీయ విమర్శలు ఎన్నయినా చేసుకోవచ్చు కానీ కొత్తగా ఉద్యోగాలొచ్చిన వారిపై ముందే అవినీతి బురద చల్లడం చంద్రబాబుకు తగదని అన్నారు.

బుధవారం ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేస్తుంటే చంద్రబాబు మాత్రం గాడ్సే వారసుడిగా వ్యవహరిస్తున్నారని  ధ్వజమెత్తారు. గ్రామ సచివాలయ వ్యవస్థ మంచిదో కాదో చంద్రబాబు ప్రజల ముందు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఉద్యోగాలు అమ్ముకున్నారని నిరూపిస్తారా? 
ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించిన చంద్రబాబు ఒక్క ఆధారమైన చూపించగలరా అని జోగి రమేశ్‌ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో గాంధీ జయంతి రోజున కూడా విచ్చల విడిగా మద్యం అమ్మేవారన్నారు.  వైఎస్‌ జగన్‌ గాంధీ వారసుడు అయితే.. చంద్రబాబు గాడ్సే వారసుడన్నారు. ‘బూతు పత్రిక యజమానికి పేపర్‌ లీకేజీపై సవాల్‌ విసిరితే, మా సవాలుకు బూతు పత్రిక యజమాని పారిపోయాడు అని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు