మాట తప్పడమే చంద్రబాబు నైజం

18 Oct, 2017 12:50 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ వరప్రసాద్‌రావు, ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి

ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే కాకాణి ధ్వజం

ఇప్పటికీ పూర్తికాని రైతురుణమాఫీ

సొంత జిల్లాను పట్టించుకోని వ్యవసాయశాఖ మంత్రి

తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు(సెంట్రల్‌): రాష్ట్రం ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పడమే సీఎం చంద్రబాబు నైజంగా ఉందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. నెల్లూరులోని మాగుంట లే అవుట్‌లో ఉన్న వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాకాణి మాట్లాడుతూ బేషరతుగా రుణమాఫీ అని చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారన్నారు. జిల్లాలో అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం 2,82,473 మంది రైతులకు గాను రూ.1,012.60 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారని గుర్తు చేశారు.

అయితే మూడున్నరేళ్లలో మొదట విడతగా రూ.394.79 కోట్లు, రెండో విడతగా రూ.154.67 కోట్లు మాఫీ చేశారన్నారు. వారిలో కూడా ఇంకా కొంత మంది రైతులుకు రుణమాఫీ కాక పోవడంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ విధంగా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సొంత జిల్లాపై కనీసం కనికరం లేకుండా ఉన్నారన్నారు. ఏడు నెలల నుంచి సంగం బ్యారేజీ కాంట్రాక్ట్‌ర్‌కు బిల్లులు చెల్లించలేదన్నారు. ఈ విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోమిరెడ్డికి అల్లీపురంలో నకిలీ ఎరువుల తయారీ, ఉదయగిరిలో పసుపు కుంభకోణంలో దోచుకోవడంలో ఉన్నంత శ్రద్ధ రైతులకు కావాల్సిన వాటిని అందించడంలో లేదని ఆరోపించారు.  

ప్రజలతరపున ప్రశ్నిస్తున్నాం
చంద్రబాబు ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చుచేసుకునే చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీ లను నెరవేర్చలేడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. 90 శాతం మంది రైతులు రుణాలు మాఫీకాక అల్లాడుతున్నారన్నారు. హైటెక్‌ రాజ ధాని అంటూ విమానాలు, హెలికాప్టర్లలో తిరగడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెలవేర్చలేదని ఆరోపించారు. 100 ఇళ్లు ఉన్న చోట ఐదు బెల్టు షాపులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పేదలకు అన్ని విధాలా మోసం చేస్తున్న చంద్రబాబుకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబు తారన్నారు. సమావేశంలో కార్పొరేషన్‌ వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ పి.రూప్‌కుమార్‌యాదవ్, వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు ఎం.వెంకటశేషయ్య, నాయకులు భాస్కర్‌గౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, కర్తం ప్రతాప్‌రెడ్డి, సుధీర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు