రేపే ఆరోదశ.. పోటీలో కీలక నేతలు

11 May, 2019 19:30 IST|Sakshi

59 స్థానాలకు రేపే ఎన్నిక

బరిలో షీలా దీక్షిత్‌, దిగ్విజయ్‌, జ్యోతిరాధిత్య

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం పలు రాష్ట్రాల్లో 59 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 14, హర్యానాలో 10, పశ్చిమ బెంగాల్‌, బీహార్, మధ్యప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 7, జార్ఘండ్‌లో 4 స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది.  ఆరో విడత ఎన్నికల్లో భాగంగా పలువురు ప్రముఖ నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వీరిలో

నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ చేతిలో తీవ్ర పరాభావానికి గురైన కాంగ్రెస్‌ ఈసారి కనీసం గౌరప్రదమైన స్థానాలను గెలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా షీలా విజయంపై పార్టీ గంపెడు ఆశాలను పెట్టుకుంది. ఆమెతో బీజేపీ సీనియర్‌ నేత మనోజ్‌ తివారి బరిలో ఉన్నారు. దేశ రాజధానికి మూడు సార్లు ఏకంగా సీఎంగా వ్యవహించడం, సీనియర్‌ నేత కావడంతో విజయావకాశాలు ఎక్కువగా తమకే ఉన్నాయని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

న్యూఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున మరో సీనియర్‌ నేత అజయ్ మాకెన్ బరిలో ఉన్నారు. 2004, 09 ఎన్నికల్లో విజయం సాధించిన మాకెన్‌ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మీనాక్షిలేఖిపై పరాజయం పాలైయ్యారు. ఈసారి అదృష్టాన్ని పరీక్షించుంటున్నారు. కాగా ఈస్థానంలో ఎవరు గెలిస్తే  ఆపార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే సాంప్రదాయం కూడా ఇక్కడుంది. గత రెండు దశాబ్ధాలుగా అదే జరుగుతూ వస్తోంది. 

ఈస్ట్ ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి. ఎన్నికల బరిలో నిలవడంతో వివాదాలు గంభీర్‌ను చుట్టుముట్టుతున్నాయి. ఆప్‌ అభ్యర్థి ఆతిషి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గంభీర్‌కు నోటీసులు కూడా పంపారు. 

మధ్యప్రదేశ్‌లోని గుణ స్థానం నుంచి మధ్య ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి జ్యోతిరాధిత్య సింధియా పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఈయనకు కీలక పదవి దక్కింది. ఇప్పటి వరకు గుణలో నాలుగు సార్లు విజయం సాధించిన సింథియా ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ ఆయన తరఫున గెలుపు బాధ్యతలను ఆయన భార్య ప్రియదర్శినీ రాజే మోస్తున్నారు. గెలపు తథ్యమనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. 

ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన తండ్రి ములాయం సింగ్‌ విజయం సాధించారు. ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరపున ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలో నిలిచారు. ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి. రాజకీయాలకు కొత్తయినా ప్రచారం దూసుకుపోతున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ నుంచి బీజేపీ తరపున వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆయన తల్లి కేంద్రమంత్రి మేనకా గాంధీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో వరుణ్ సుల్తాన్‌ పూర్‌ నుంచి విజయం సాధించారు. ఈసారి వారిద్దరూ స్థానాలు మార్చుకున్నారు. 

భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి మధ్య ప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పోటీపడుతున్నారు. ఈస్థానంలో బీజేపీ అభ్యర్థిగా సాద్వీ ప్రజ్ఞాసింగ్‌ పోటీలో ఉన్నారు. 


 

మరిన్ని వార్తలు