ఏపీలో ఆ పిలుపు ఇవ్వగలరా?

31 Dec, 2018 16:48 IST|Sakshi

చంద్రబాబుకు కోలగట్ల ప్రశ్న

సాక్షి, విజయనగరం: ప్రధాని నరేంద్ర మోదీపై పోరాడలేక వైఎస్‌ జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీతో తమకు సంబంధాలు అంటగట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఒడిలో కూర్చుని నవనిర్మాణ దీక్ష చేసి, కాంగ్రెస్‌ పార్టీతో కలిశాక చేస్తున్న ధర్మపోరాట దీక్ష చూసి ప్రజలు తలదించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు తాను చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోడానికి రాష్ట్ర ప్రజలందరినీ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.

నాలుగు సంవత్సరాల పాలనపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న ముఖ్యమంత్రికి ఎన్నికల హామీలు, ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేసే సత్తా ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీలు మారిన వారిని చిత్తుగా ఓడించాలన్న చంద్రబాబు ఏపీలో ఆ పిలుపు ఇవ్వగలరా అని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు