‘ఆమె గెలిస్తే.. రాజకీయ సన్యాసమే’

6 Jul, 2018 15:36 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)కి 100 సీట్లు రావని, నిజామాబాద్ ఎంపీగా కవిత మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ సర్వేలు అంతా బూటకమంటూ మండిపడ్డారు. తనను, సంపత్‌కుమార్‌ను అన్యాయంగా ఎమ్మెల్యే సభ్యత్వాల నుంచి తొలగించే ప్రయత్నం చేశారని, అయితే చివరకు న్యాయమే గెలిచిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మా ఇద్దరి శాసనసభ్యత్వాలు ఇంకా పునరుద్ధరించలేదని, హైకోర్టు ఉత్తర్వులను సైతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గౌరవించడం లేదని తెలిపారు.

నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు పెరగడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం దోపిడీకే ప్రాధాన్యం ఇస్తుందని, అందుకే అవినీతిలో తెలంగాణ అగ్రభాగాన ఉందని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడాలేని వింతగా కాళేశ్వరం ప్రాజెక్టును టీఆర్‌ఎస్‌ చూపిస్తోందని.. అయితే గతంలో తాము మొదలుపెట్టిన ప్రాజెక్టులు కడితే కాంగ్రెస్‌ పార్టీకి పేరు వస్తుందన్న కారణంగా వాటిని పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లు లేనిదే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమాత్రం పని చేయడం లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీని అమ్మకాదు బొమ్మ అని మాట్లాడటం నిజంగా దురదృష్టకరం. వాళ్ల అమ్మను ఆ నేతలు అలాగే సంబోధిస్తారా. రైతు బంధు పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టింది. అధికార భయంతో సీఎం కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కే పరిమితం అయ్యారు. కేసీఆర్‌ చెబుతున్న సర్వేలు ఒట్టి బూటకం. శ్రీ చైతన్య కార్పొరేట్‌ గా లూటీ చేస్తోంది. అలాంటి యాజమాన్యాలను అడ్డుకుని కాలేజీల పర్మిషన్లు రద్దు చేయాలి. దీనిపై త్వరలోనే కోర్టులో కేసు వేస్తామని’ కోమటిరెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు