ఎన్నికల వేళ.. నేతల గృహనిర్భందం

8 Oct, 2018 08:40 IST|Sakshi

కశ్మీర్‌లో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికలు

వేర్పాటువాదులను గృహనిర్భందం చేసిన పోలీసులు

ఎన్నికలను బహిష్కరించిన ఎన్‌స్సీ, పీడీపీ

శ్రీనగర్‌ : కట్టుదిట్టమైన భద్రత నడుమ జమ్మూ కశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యాయి. మొదటి విడతగా 12 జిల్లాల్లోని 30 మున్సిపాలిటీలో గల 400 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకుండా వేర్పాటువాదల నాయకుల్ని ముందస్తుగా గృహనిర్భందంలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా మీర్వాజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌, సయ్యద్‌ అలీ షా గిలానీ, యాసీన్‌ మాలిక్‌ వంటి కరుడుగట్టిన వేర్పాటువాద నాయకుల్ని గృహనిర్భందం చేసి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. 13 ఏళ్ల అనంతరం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను.. ప్రధాన పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌స్సీ), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) బహిష్కరించిన విషయం తెలిసిందే.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 35(ఎ)పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా  ఆ రెండు పార్టీలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఇదివరికే ప్రకటించాయి. ప్రధాన పార్టీలు రెండూ బరిలో నుంచి తప్పుకోవడంతో.. ముఖ్యంగా కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. జమ్మూ ప్రాంతంలో బలమైన  క్యాడర్‌ గల బీజేపీ.. ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తామని ఈ రాష్ట్ర మాజీ సీఎం కవీంద్ర గుప్తా ధీమా వ్యక్తం చేశారు. కాగా 400 స్థానాలకుగాను 1283 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. పలు ప్రాంతాల్లో అలర్లు జరిగే అవకాశం ఉన్నందున్న కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని భద్రత దళాలు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సేవలను పూర్తిగా నిలిపివేయగా, మరోకొన్ని ప్రాంతాల్లో 2జీ సేవలు అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు