అందుకే చంద్రబాబు కారణాలు వెతుకుతున్నారు

13 Mar, 2020 20:32 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరిచేస్తుంటే.. బాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇసుకను భారీగా దోపిడీ చేసిందని, నామినేషన్‌​ పద్ధతిలో కాంట్రాక్ట్‌లను దోచి పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే చంద్రబాబు తప్పుడు ఆరోపణలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని అన్నారు.. చంద్రబాబుపై నమ్మకం లేకే ముఖ్య నేతలంతా రాజీనామా చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తప్పదని తెలిసే చంద్రబాబు కారణాలు వెతుకుతున్నారని పేర్కొన్నారు. (ఇది బీసీలకు దక్కిన అరుదైన గౌరవం)

చంద్రబాబు తన రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలను వాడుకున్నారని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారని, ఒక్క బీసీకైనా బాబు రాజ్యసభ అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదని, సీఎం వైఎస్‌ జగన్‌ ఇద్దరు బీసీలకు రాజ్యసభ అవకాశం ఇచ్చారని, గత అయిదేళ్లలో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయకుండా ఇప్పుడు రాజకీయంగా బాబు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని, బీసీ జనాభాను శాస్త్రీయ గణన చేసేందుకు సీఎం ఆదేశాలిచ్చారన్నారు.  ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్‌కు ఈ సందర్బంగా ప్రసాదరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్లు లభిస్తాయని ధర్మాన తెలిపారు. ('చంద్రబాబువి స్వార్థపూరిత రాజకీయాలు')

మరిన్ని వార్తలు