'వారి ఉద్యోగాలు తొలగించే అధికారం కేసీఆర్‌కు లేదు'

12 Nov, 2019 14:49 IST|Sakshi

సాక్షి, దుబ్బాక : కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తీసే అధికారం ప్రజలకు ఉంది.. కానీ కార్మికులను తీసేసే అధికారం కేసీఆర్‌కు లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్‌ రెండు లక్షల అరవై కోట్ల అప్పు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులు 39 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు.

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్రను ప్రభుత్వం మరిచిపోయిందని, రెండు నెలలుగా కార్మికులు అన్ని పండుగలకు దూరమై ఆకలితో అలమటిస్తున్నారని తెలిపారు. దాదాపు కోటి మంది జనాభాకు రవాణా సదుపాయం కల్పిస్తున్న కార్మికుల పట్ల కేసీఆర్‌ అహంకార దోరణిని ప్రదర్శించడం తగదని హెచ్చరించారు. ఆర్టీసీ మంత్రిగా ఉన్నప్పుడు సంస్థను లాబాల్లోకి తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్‌ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం కార్మికుల పట్ల కఠిన వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు.

ఆర్టీసీకి రావాల్సిన మూడు వందల కోట్లు ఇవ్వాలని కేసీఆర్‌ బిల్లు పాస్‌ చేస్తే ఆయన కొడుకు కేటీఆర్‌ మాత్రం బిల్లును ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలనిపేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ నష్టానికి కార్మికులే భారమైతే ఆంధ్రలో ఈ పరిస్థితి ఎందుకు రాలేదో చెప్పాలని తెలిపారు. దేశంలో అన్నిటికంటే ఎక్కువ జాతీయ అవార్డులు పొందిన ఏకైక సంస్థ ఆర్టీసీయేనని వెల్లడించారు. ఇప్పటికైనా కేశవరావు, హరీష్‌ రావులు కార్మికుల పక్షాన నిలబడాలని, లేదంటే మీ పదవులు ఊడడం ఖామమని హెచ్చరించారు.  కాంగ్రెసు పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కాంగ్రెస​ నేత తూంకుంట నర్సారెడ్డి తెలిపారు.సిద్దిపేట లో ట్రిపుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్ రావు పథనం సిద్దిపేట నుంచి త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు