సాక్షి, న్యూఢిల్లీ : ఆరు దశాబ్ధాలుగా దేశానికి తాము చేసిన సేవలను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ తమ ఘనతగా చాటుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేశంలోని 6,49,867 గ్రామాలకు గాను కాంగ్రెస్ పార్టీ 97 శాతం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించిందని ఆ పార్టీ ప్రతనిధి రణ్దీప్ సింగ్ సుర్జీవాలా ట్వీట్ చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షాను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేస్తూ యూపీఏ పదేళ్ల హయాంలో లక్షకు పైగా గ్రామాలకు విద్యుదీకరణ చేపట్టామన్నారు.
గత 60 ఏళ్లలో ఏటా 10,000 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ విద్యుత్ను అందుబాటులోకి తెచ్చిందని, మోదీ ప్రభుత్వం ఏడాదికి కేవలం 4813 గ్రామాలకే విద్యుత్ సౌకర్యం కల్పిస్తోందని సుర్జీవాలా చెప్పుకొచ్చారు.తాము అధికారంకోల్పోయిన మే 2014 నాటికి కేవలం 18,452 గ్రామాలకే విద్యుత్ సౌకర్యం లేదని, ఈ గ్రామాలకు విద్యుత్ను అందుబాటులోకి తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వానికి 46 నెలల సమయం పట్టిందని విమర్శించారు. అసమర్ధతను గొప్పగా చెప్పుకోవడం, కాంగ్రెస్ చేపట్టిన పనులను తమ ఘనతగా చెప్పుకోవడం బీజేపీకి చెల్లిందని ఎద్దేవా చేశారు.