పోటీ చేసే సత్తా లేకే విమర్శలు

28 Dec, 2019 03:14 IST|Sakshi

విపక్షాలపై మంత్రి కేటీఆర్‌ మండిపాటు 

సాక్షి, హైదరాబాద్‌: ‘మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి మా పార్టీలో ఆశావహులు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. పోటీ చేసే సత్తా లేని విపక్షాలు టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీకీ ఎక్కడైనా అధికార పార్టీ దూరంగా ఉంటుంది కానీ.. ఇక్కడ ప్రతిపక్షాలు దూరంగా ఉంటున్నా యి’ అని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. పురపాలక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ సమావేశమయ్యారు. 

అనంతరం పార్టీ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లా డారు. ‘పార్టీ అభ్యర్థుల ఎంపిక వికేంద్రీకరణ పద్ధతిలో ఎక్కడికక్కడే స్థానికంగా జరుగుతుంది. పార్టీ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని సూచనలు చేస్తుంది. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎమ్మె ల్యేలు, ఇన్‌చార్జులు అప్రమత్తంగా ఉంటూ ప్రచార, సమన్వయ బాధ్యతలు తీసుకోవాలి’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తమకు ఎంఐఎంతో గతం లోనూ పొత్తుల్లేవని, 42% జనాభా పట్టణాల్లోనే ఉన్నందున ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.  

ప్రభుత్వ పనితీరే అస్త్రం! 
‘తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు సీఎం కేసీఆర్‌ నాయకత్వానికి మద్దతు పలుకుతున్నారు. 2014 లో 63 అసెంబ్లీ స్థానాలు గెలుపొందగా, 2018లో 88 స్థానాలతో పాటు, ఆ తర్వాత జరిగిన హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికలోనూ విజయం సాధిం చాం. అయినా మౌలిక సదుపాయాల కల్పన, సేవలపై దృష్టి పెట్టాం.  

గతం లో 73 మున్సిపాలిటీలు ఉండగా, ప్రస్తుతం 141 మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. పల్లె ప్రగతి తరహాలో పట్టణ ప్రగతి కోరుకుంటున్నారు. కొత్త పాలక వర్గాలు ఏర్పాటైన తర్వాత నిధులు ఇచ్చి పట్టణాలను బాగు చేస్తాం. ప్రభుత్వ పనితీరే మాకు పెద్ద అస్త్రం. 60 లక్షల మంది కార్యకర్తల ద్వారా ప్రభుత్వ అభివృద్ధిని వివరిస్తాం. 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేలా టీఎస్‌ఐపాస్‌ తరహాలో టీఎస్‌బీపాస్‌ అమల్లోకి తెస్తాం’అని కేటీఆర్‌ వివరించారు. 

సీఏఏపై మా వైఖరి ప్రకటించాం 
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తమ పార్టీ అభిప్రాయాన్ని పార్లమెంటులో వినిపించామని కేటీఆర్‌ తెలిపారు. ముస్లింలు అనే పదాన్ని తొలగించాలని కోరినా స్పందన లేకపోవడంతో విప్‌ జారీ చేసి వ్యతిరేకంగా ఓటేసినట్లు గుర్తుచేశారు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్‌ కేబినెట్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు మాలోతు కవిత, బడుగుల లింగయ్యయాదవ్, ప్రకాశ్‌ముదిరాజ్, రాములు పాల్గొన్నారు. 

2న కేసీఆర్‌ కీలక సమావేశం 
మున్సిపోల్స్‌లో పార్టీ యంత్రాంగం సన్నద్ధత, అభ్యర్థుల ఎంపిక, సమన్వయం తదితరాలకు సంబంధించి జనవరి 2న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ కీలక సమావేశం జరగనుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎన్నికల ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొంటారని సమాచా రం. 

సమావేశానికి పూర్తి సమాచారంతో రావా లని నేతలకు కేటీఆర్‌ సూచించారు. మున్సిపాలిటీల వారీగా పార్టీ పరిస్థితి, నేతల పనితీరు, ఎమ్మెల్యేలకు, స్థానిక నేతలకు మధ్య సమన్వయం, ఇతర పార్టీల బలాబలాలు తదితరాలకు సంబంధించి డిసెంబర్‌ 31లోగా మళ్లీ నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది. ‘కొల్లా పూర్‌లో జూపల్లి కృష్ణారావు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేశారు. గతేడాది ఆయనపై గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. 

అలాగే తాండూరులోనూ మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిపై గెలుపొందిన రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలాంటి చోట ఇద్దరు నేతల నడుమ సమన్వయంతో పాటు, గెలుపును ప్రాతిపదికగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగాలి’అని కేటీఆర్‌ ఇన్‌చార్జులకు సూచించినట్లు తెలిసింది. ఇతర పార్టీల్లో ఉండే బలమైన అభ్యర్థులతో పాటు, తటçస్థులను కూడా పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించాలని కేటీఆర్‌ సూచించారు.    

మరిన్ని వార్తలు