మడకశిర : కర్నాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడితేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఆయన శనివారం శిర అసెంబ్లీ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, మంత్రి టీబీ జయచంద్ర తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. దాదాపు 23 గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాగోడు గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. దీంతో కర్నాటక ప్రజలు మోదీ మాటలు నమ్మి మోస పోవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని నిండా ముంచారని పీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి బుద్ధి నేర్పాలన్నారు. కర్నాటకలో బీజేపీని ఓడిస్తే ఏపీ ప్రజలకు న్యాయం జరుగుందని ఆయన అన్నారు. ఎన్నికలలో బీజేపీని ఓడిస్తే ఏపీకీ ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కర్నాటక ఓటర్లు ఎంతో విజ్ఞత ఉన్న వారని.. ఈ ఎన్నికల్లో ప్రజల సత్తా ఏంటో బీజేపీకి రుచి చూపించాలని పీసీసీ చీఫ్ రఘువీరా కోరారు.