చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి ఫైర్
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు పోసాని కృష్ణమురళీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మన్ననలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు ద్వేషమని, అందుకే కుట్రపన్ని ఆయనను జైలుకు పంపారని పోసాని విమర్శలు చేశారు.
పాలనా సౌలభ్యం కోసమే అధికార వికేంద్రీకరణ ప్రతిపాదన తీసుకు వచ్చారన్నారు. ముఖ్యమంత్రి ఎవరికీ అన్యాయం చేయరని పోసాని తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు దయచేసి నిరసనలు, ఆందోళనలు విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రప్రభుత్వం అన్నివర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని పోసాని తెలిపారు. రోడ్లు మీదకు వచ్చి ఎమ్మెల్యేలపై దాడి చేయడం సరికాదని అన్నారు.