లాలూకు ప్రశాంత్‌ కిషోర్‌ ఛాలెంజ్‌

13 Apr, 2019 17:10 IST|Sakshi

పట్నా : తమ పార్టీని సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూలో విలీనం చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రతిపాదించారని బిహార్‌ మాజీ సీఎం, ఆర్‌జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్‌ కిషోర్‌ ఘటుగా స్పందించారు. లాలు కోరుకుంటే  ఎప్పుడైనా తనతో పాటు మీడియా ముందుకు వచ్చి చర్చ జరపవచ్చని ఛాలెంజ్‌ చేశారు. మీడియా ముందు చర్చ జరిగితే ఎవరేంటో..ఆ రోజు ఏం జరిగిందో, ఎవరు ఎవరికి ఏం ఆఫర్‌ ఇచ్చారో ప్రజలకు తెలియజేయవచ్చు అని ట్విట్‌ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు నిజాన్ని కాపాడుతున్నారా అని మండిపడ్డారు. 

చదవండి...‘ప్రశాంత్‌ కిశోర్‌ మా పార్టీని విలీనం చేయమన్నారు’

కాగా ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యలను ఆర్‌జేడీ తిప్పికొట్టింది. ‘పండిత్‌ జీ.. మీ వయసు మా పార్టీ అధినేత అనుభవమంతా కాదు. మీలాంటి రాజకీయ నాయకులను చాలా మంది వచ్చి వెళ్లారు. మోదీ, నితీష్‌ల దగ్గరకు వెళ్లి మీ స్టోరీలను అమ్ముకోండి. మేము నిజం బయటపెడితే మీ పరువు, కీర్తి పోతుంది’  అని పార్టీ ట్వీట్‌ చేసింది. సీఎం నితీశ్‌ తరఫున ప్రశాంత్‌ మమ్మల్ని కలిశారని, రెండు పార్టీలను విలీనం చేసి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయిద్దామని చెప్పారని రబ్రీ దేవి ఆరోపించారు. ఒక సందర్భంలో తనకు బాగా కోపం వచ్చి ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని చెప్పానన్నారు. 

ప్రశాంత్ కిశోర్.. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నితీశ్ కుమార్, లాలూతో కలిసి పని చేశారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ సహా ఆరు పార్టీలు జనతా పరివార్‌గా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేశాయి. నితీశ్ కుమార్‌ను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ 81 స్థానాలు, జేడీయూ 70, బీజేపీ 53  స్థానాల్లో గెలిచాయి.అనంతరం ఆర్జేడీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2017లో నితీశ్ కూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు