ఫోన్‌లో చూస్తూ బిజీ బిజీగా రాహుల్‌!

20 Jun, 2019 16:24 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యవహరించిన తీరు.. వివాదాస్పదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. నవభారతం నిర్మాణం దిశగా ముందడుగు వేద్దామంటూ.. భవిష్యత్తు పట్ల ఆశావాదం, దృఢ సంకల్పంతో సాగుదామని గురువారం పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు.

రాష్ట్రపతి సీరియస్‌గా ప్రసంగిస్తున్న సమయంలో రాహుల్‌ తన సెల్‌ఫోన్‌లో చూస్తూ బిజీబిజీగా గడిపినట్టు తెలుస్తోంది. రాహుల్‌ పక్కన కూర్చున్న యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు మొదటి వరుసలో కూర్చున్న ప్రధాని మోదీ, ఇతర సభ్యులు శ్రద్ధగా రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆలంకించారు. అయితే రాహుల్‌ మాత్రం తన సెల్‌ఫోన్‌లో ఏదో చూస్తున్నట్టు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ కిసాన్‌ మోర్చా తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలోనూ రాహుల్‌ ఫోన్‌లో బిజీగా గడిపారని కామెంట్‌ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని, తన తదుపరి అధ్యక్షుడు ఎవరు అన్నది పార్టీ నిర్ణయిస్తుందని రాహుల్‌ తాజాగా పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు