బలనిరూపణ కాకుండానే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు?

26 Nov, 2019 11:21 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రోజుకో మలుపు తిరుగుతూ.. ప్రజల్ని గందరగోళ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన 48 గంటల్లోనే ఆయనపై ఉన్న రూ. 70వేల కోట్ల ఇరిగేషన్ స్కామ్‌ కేసులో ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో అజిత్‌పై ఉన్న 20 కేసుల్లో 9 కేసులపై మాత్రమే ఆయనకు క్లీన్‌చీట్ ఇచ్చినట్లు ఏసీబీ వివరణ ఇచ్చింది.

అయితే అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లే క్విడ్ ప్రోకో కింద అతనికి కేసుల నుంచి ఊరట ఇచ్చినట్లు కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పార్టీలు విమర్శిస్తున్నాయి. అజిత్ పవార్‌పై కేసులు మూసివేయడం అనేది సక్రమం కాదని అక్రమమని ఆ పార్టీలు విమర్శించాయి. దీనిపై శివసేన.. అజిత్ పవార్‌కు ఇరిగేషన్ స్కామ్‌లో ఊరటనిస్తూ ఏసీబీ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బలనిరూపణ కాకుండానే రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని పిటిషన్‌లో పేర్కొంది.

>
మరిన్ని వార్తలు