‘అఖిలేష్‌ కాంగ్రెస్‌ను మోసం చేస్తున్నారు’

19 Jan, 2019 19:49 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జట్టుకట్టిన బీఎస్పీ, ఎస్పీ కూటమిపై ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ(పీఎస్పీ) చీఫ్‌ శివపాల్‌ యాదవ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి మోసపూరితమైనదని, మాయావతిని అంత తేలికగా నమ్మకూడదని శివపాల్‌ ఆరోపించారు. అఖిలేష్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు తన తండ్రి ములాయ్‌ సింగ్‌ను కూడా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అఖిలేష్‌.. కూటమికి కాంగ్రెస్‌ను దూరం పెట్టడం సరికాదన్నారు.

అధికారం కోసం మాయావతి ఎంతకైనా తెగిస్తారని.. 1993లో ఆమె చేసిన మోసాన్ని ఈ సందర్భంగా శివపాల్ గుర్తుచేశారు. గతంలో మాయావతి బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషాయాన్ని అఖిలేష్‌ గ్రహించాలని సూచించారు. ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్‌ యాదవ్‌ కారణంగానే పార్టీ నష్టపోయిందని ఆరోపించారు. రాంగోపాల్‌ వల్లనే గత పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిందని పేర్కొన్నారు. అఖిలేష్‌తో విభేదాల కారణంగా శివపాల్ పీఎస్పీని స్థాపించిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు