‘ఎన్టీఆర్‌ ఆశయాలను సమాధి చేస్తున్నారు’

2 Oct, 2018 13:42 IST|Sakshi
సోము వీర్రాజు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్‌ ఆశయాలను హతం చేసేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ  సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఢిల్లీలో పలువురు బీజేపీ ఆగ్రనేతలను కలిసిన అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి సాక్షిగా టీడీపీని కాంగ్రెస్‌తో కలిపి చంద్రబాబు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడని విమర్శించారు. ‘ఓటుకు కోట్లు కేసు’ లో అడ్డంగా పట్టుపడ్డ టీడీపీ నేతను కాంగ్రెస్‌లోకి పంపించి తెలంగాణలో ఆ పార్టీని బతికించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అవినీతిమయమైన కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఊసరవెల్లి రాజకీయాలను నడపడంలో చంద్రబాబు దిట్ట అని వ్యాఖ్యానించారు. దగాకోరు ప్రకటనలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వ అవినీతికి బీజేపీ చరమగీతం పాడబోతుందని స్పష్టం చేశారు. పోలవరం, టాయిలెట్ల నిర్మాణం, పేదలకు కట్టించే ఇండ్లల్లో 30 వేల కోట్లతో అవినీతికి పాల్పడిన చంద్రబాబు ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కేం‍ద్రం అన్ని రాష్ట్రాల కంటే అదనంగా ఏపీకి తొమ్మిది వేల కోట్లు ఇస్తుందన్నారు. 2019లో చంద్రబాబు రాజకీయం అంతం అవుతుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక మాఫియాను నడుపుతున్నారని ఆరోపించారు. బీజేపీలో కోవర్టులుండరు.. కేవలం దేశ భక్తులు మాత్రమే ఉంటారు.  

చదవండి: ‘హైదరాబాద్‌లో చేసిన తప్పే అమరావతిలో చేస్తున్నారు’

ఆయనపై కేసులు వేస్తే కోర్టులకు టైమ్‌ చాలదు

మరిన్ని వార్తలు