మోదీ తల్లి గురించి మాట్లాడితే నాలుక చీలుస్తా 

4 Apr, 2019 14:21 IST|Sakshi

సీఎం చంద్రబాబుపై బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యలు  

అనంతపురం టవర్‌ క్లాక్‌: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి గురించి సీఎం చంద్రబాబు పదేపదే ప్రస్తావిస్తున్నారని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన నాలుకు చీలుస్తామని బీజేపీ ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌ సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఈ ఐదేళ్లూ అవినీతి, అక్రమాలే చేశారన్నారు. దొంగలెక్కలు చూపి అవార్డులు దక్కించుకున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రాభివృద్ధి కోసం రూ. 10 వేల కోట్ల నిధులు విడుదల చేస్తే.. ఆ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. పైగా కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి తానే ప్రవేశపెట్టినట్లు గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం కేంద్రం రూ. 7 వేల కోట్లు విడుదల చేస్తే.. చంద్రబాబు ఆ నిధులను తన సొంత కార్యక్రమాలకు వాడుకున్నారని ఆరోపించారు. పోలవరం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు అవినీతిపై చర్చ పెడతామని దమ్ముంటే ఆయన పాల్గొనాలని సవాల్‌ విసిరారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ నెల 7న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ అనంతపురం పార్లమెంట్‌ అభ్యర్థి దేవినేని హంస, బీజేపీ నాయకులు లలితకుమార్, దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు