ఉద్యమం అంటే ఏంటో మేం చూపిస్తాం: స్పీకర్‌

10 Jan, 2020 10:42 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఉత్తరాంధ్ర ఫోరం అండగా ఉంటుందని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. జిల్లాలో శుక్రవారం స్పీకర్‌ మాట్లాడుతూ.. సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసే పోరాటాలకు ధీటైన సమాధానం చెబుతామని పేర్కొన్నారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ను, ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు జనాల్ని రెచ్చగొట్టి ఉద్యమం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో సాగేది సహజ సిద్ధమైన పోరాటం కాదని, అసలుసిసలైన ప్రజా ఉద్యమం అంటే ఏంటో తాము చూపిస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి రాజయలసీమ వరకూ సాగే ఉద్యమం ఎలా ఉంటుందో బాబు చూస్తారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిన టీడీపీ నేతలు పార్టీ స్టాండ్ తో అమరావతి కావాలనడం సిగ్గుచేటని అన్నారు. ఇన్నేళ్లుగా పేదరికం, వెనుకబాటుతనానికి ఈప్రాంతం గురవుతుంటే వాళ్లకు కళ్లు లేవా అని స్పీకర్‌ ప్రశ్నించారు.

‘ఓ ఉత్తరాంధ్ర పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నా.. సమాధానం చెప్పండి. రాజకీయం చేసుకుని బతికే మీదీ ..ఒక బతుకేనా? మా రాజధానిని మేం దక్కించుకునేందుకు ఎంత వరకైనా పోరాడుతాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. గతంలో ఏ కారణం లేకుండా సీఎం వైఎస్‌ జగన్‌ను విశాఖ ఎయిర్ పోర్టులో ఎందుకు అరెస్ట్ చేశారు. ఇంకా మా పేదరికంతో, ఆకలి మంటలతో ఆడుకోవద్దని చంద్రబాబుని హెచ్చరిస్తున్నా. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు అన్ని సంఘాలు ఏకమవుతాం. అమరావతిలోలాగా పెయిడ్ ఆర్టిస్ట్ ఉద్యమం కాదు. విశాఖలో రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తే ఉద్యమం అంటే ఏంటో చూపిస్తాం’ అని స్పీకర్‌ తమ్మినేని పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబును తిరగనివ్వం)

మరిన్ని వార్తలు