సాక్షి, ఆదిలాబాద్: ప్రస్తుత జెడ్పీటీసీలు, ఎంపీపీలకు ఈ ప్రాదేశిక ఎన్నికలు అచ్చిరాలేదు. తాజా మాజీలు ఇక పూర్తిగా మాజీలుగా మారనున్నారు. ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి మూడు విడతల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. జిల్లాలో ముఖచిత్రం ప్రస్పుటమైంది. ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారిలో అత్యధికులు మళ్లీ పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికి రిజర్వేషన్ల మార్పు ఒకటి కారణం కాగా, మారిన రాజకీయ పరిస్థితులు కూడా ప్రభావం చూపాయి. గత ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లా పరంగా పరిశీలిస్తే.. 13 మండలాలు ఉండగా అందులో ఒక బేల జెడ్పీటీసీ మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. మిగతా అన్నిచోట్ల అటు జెడ్పీటీసీ, ఇటు ఎంపీపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
ఆదిలాబాద్ జెడ్పీటీసీగా ఉన్న ఇజ్జగిరి అశోక్ ఈసారి అసలు ఎన్నికల బరిలోనే లేరు. ప్రధానంగా ఆయన నివాసం దస్నాపూర్ కాగా అది ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనం కావడంతో నైసర్గిక స్వరూపం మారింది. దీంతో ఆయన జెడ్పీటీసీగా పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలవాలని యోచిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీపీగా ఉన్న నైతం లక్ష్మీశుక్లాల్ కూడా ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఎంపీపీ స్థానం జనరల్ రిజర్వ్ అయింది. వాన్వట్ నుంచి గతంలో ఎంపీటీసీగా గెలిచిన ఆమె ఈసారి ఆ స్థానం జనరల్(మహిళ)కు ఇవ్వడంతో పోటీ అధికంగా ఉంది.
దీంతో ఆమె కూడా పోటీ చేయడం లేదు. ఈ మండలంలో ఇటు జెడ్పీటీసీ అటు ఎంపీపీ ఇరువురు మాజీలు కానున్నారు. బేల జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాక్లే రాందాస్ ఉండగా, ప్రస్తుతం బేల జెడ్పీటీసీ జనరల్(మహిళ) రిజర్వ్ కావడంతో ఆయన భార్య నాక్లే సవితను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దించారు. బేల ఎంపీపీగా ఉన్న రఘుకుల్రెడ్డికి ఈసారి రిజర్వేషన్లు అనుకూలించలేదు. గతంలో ఆయన పోటీచేసిన సాంగిడి ఎంపీటీసీ స్థానం ఎస్టీ(జేనరల్) కావడంతో ఆయన అసలు పోటీలోనే దిగలేకపోయారు.
ఇక ఎంపీపీ జనరల్ మహిళ రిజర్వ్ కావడంతో ఆయనకు ఏది అనుకూలంగా లేకపోయింది. దీంతో పోటీకే దూరమయ్యారు. జైనథ్ జెడ్పీటీసీ పెందూర్ ఆశారాణి ఉండగా, ప్రస్తుతం జనరల్(మహిళ) రిజర్వ్ అయినా టీఆర్ఎస్ పార్టీ పరంగా ఆమెకు అవకాశం దక్కలేదు. దీంతో పోటీకి దూరమయ్యారు. ఎంపీపీ తల్లెల శోభ చంద్రయ్య ఉండగా, ఆమె ఎంపీటీసీగా పోటీ చేసిన బాలాపూర్ బీసీ(జనరల్) రిజర్వ్ కావడం, పోటీ అధికంగా ఉండడంతో ఆమె బరిలో నిలవలేదు. కాగా ఎంపీపీ స్థానం ఈసారి బీసీ(జనరల్) కేటాయించడం, టీఆర్ఎస్లో ఎంపీపీ స్థానం విషయంలో మరోపేరు ప్రచారంలో ఉండడంతో తల్లెల శోభకు అనుకూలించలేదు.
నార్నూర్ జెడ్పీటీసీగా ఉన్న రూపావతి జ్ఞానోబాపుష్కర్కు రిజర్వేషన్ అనుకూలించలేదు. నార్నూర్ జెడ్పీటీసీ ఈసారి ఎస్టీ(జనరల్) రిజర్వ్ కావడంతో బీసీ అయిన ఆమె పోటీకి దూరమయ్యారు. కిందటిసారి నార్నూర్ జెడ్పీటీసీగా గెలిచిన ఆమె ఓ దశలో ఉమ్మడి ఆదిలాబాద్ చైర్పర్సన్గా పేరు పోటీకి వచ్చింది. అయితే ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. ఈసారి రిజర్వేషన్ కలిసిరాకపోవడంతో ఆమె మాజీ కానున్నారు. నార్నూర్ ఎంపీపీ రాథోడ్ గోవింద్నాయక్ గతంలో ఎంపీటీసీగా పోటీ చేసిన పర్సువాడ ప్రస్తుతం కొత్త మండలం గాదిగూడలో ఉంది. గాదిగూడలో రిజర్వేషన్ ఎస్టీ(మహిళ) వచ్చినప్పటికి టీఆర్ఎస్ నుంచి అవకాశం రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన భార్య రాథోడ్ నీలాబాయిని రంగంలోకి దించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ మాజీలు కానున్నారు.
ఇంద్రవెల్లి జెడ్పీటీసీ దేవుపూజే సంగీతకు రిజర్వేషన్ అనుకూలించలేదు. ప్రస్తుత రిజర్వేషన్ ఎస్టీ(మహిళ) రావడంతో ఆమె పోటీలో నిలబడలేదు. ఇంద్రవెల్లి ఎంపీపీ జాదవ్ మీరాబాయి కేస్లాపూర్ ఎంపీటీసీ స్థానం నుంచి గతంలో గెలిచారు. అయితే ఈసారి కేస్లాపూర్ ఎంపీటీసీ స్థానం జనరల్ కేటాయించడంతో ఆమె భర్త జాదవ్ ప్రకాష్ బరిలో నిలిచారు. ఉట్నూర్ జెడ్పీటీసీ జగ్జీవన్కు రిజర్వేషన్ అనుకూలించలేదు. ప్రస్తుతం జెడ్పీటీసీ ఎస్టీ(మహిళ) రిజర్వ్ కావడంతో ఆయనకు కలిసిరాలేదు. టీఆర్ఎస్ నుంచి గెలిచిన విమల ఎంపీపీ అయినా ఇటీవల కాంగ్రెస్లో చేరారు. అయితే ఆమె ఉట్నూర్ జెడ్పీటీసీ డమ్మి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేశారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా చారులత రాథోడ్ పోటీ చేస్తుండటం, ఆమెను జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విమలకు ఈ ఎన్నికలు కలిసిరాలేదు.
బోథ్ జెడ్పీటీసీ బండారు సాయమ్మకు ఈ ఎన్నికల్లో పార్టీ అనుకూలంగా లేదు. బోథ్ జెడ్పీటీసీ స్థానం జనరల్(మహిళ) రిజర్వ్ కావడంతో ఆమె నామినేషన్ వేసినా టీఆర్ఎస్ నుంచి బీ–ఫాం ఇవ్వలేదు. ఎంపీపీ గంగుల లక్ష్మి ఎంపీటీసీ స్థానం బోథ్ కాగా, ఈసారి రిజర్వేషన్ జనరల్(మహిళ) వచ్చినా ఆమెకు పార్టీ పరంగా టిక్కెట్ ఇవ్వలేదు. బజార్హత్నూర్ జెడ్పీటీసీ మునీశ్వర్ నారాయణ ఈసారి ఎన్నికల్లో నిలబడలేదు. బజార్హత్నూర్ జెడ్పీటీసీ జనరల్ అయినా ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. బజార్హత్నూర్ ఎంపీపీగా ఇది వరకు టెంబీ ఎంపీటీసీ రాంరెడ్డి ఉండగా, ఆయన గతంలోనే మృతి చెందారు.
ఆ తర్వాత పిప్రి ఎంపీటీసీగా ఉన్న రాంరెడ్డి సతీమణి శ్రీమతి ఎంపీపీగా కొనసాగారు. టెంబీ ఎంపీటీసీ స్థానం జనరల్(మహిళ) అయినా ఆమె బరిలో నిలవలేదు. పిప్రి ఎంపీటీసీ స్థానం ఎస్సీ రిజర్వ్ అయింది. గుడిహత్నూర్ జెడ్పీటీసీ కేశవ్గిత్తేకు ఈసారి రిజర్వేషన్ అనుకూలంగా ఉన్నా ఆయన టీఆర్ఎస్ నుంచి బరిలో నిలవలేదు. తన సమీప బంధువు కరాడ్ బ్రహ్మానందంకు టిక్కెట్ లభించింది. దీంతో కేశవ్గిత్తే ఇక మాజీ కా>నున్నారు. ఎంపీపీగా ఉన్న సత్యరాజ్ ఎంపీటీసీ స్థానం గుడిహత్నూర్–1 కాగా జనరల్(మహిళ) రిజర్వ్ అయింది. దీంతో ఆయన బరిలో నిలవలేదు.
ఈ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ ఇద్దరు పోటీలో లేరు. నేరడిగొండ జెడ్పీటీసీగా సయ్యద్ యాస్మిన్ ప్రస్తుతం వ్యవహరిస్తుండగా ఆమెకు రిజర్వేషన్ అనుకూలించలేదు. ఎస్టీ(జనరల్) రిజర్వ్ కావడంతో ఆమె బరిలో నిలవలేదు. అయితే పార్టీలోనే కొనసాగుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంపీపీ బర్దావల్ సునీత ఎంపీటీసీ స్థానం కొర్టికల్ కాగా ప్రస్తుతం ఆ స్థానం లింగట్లగా మారింది. ఎస్టీ(మహిళ) రావడంతో బీసీ అయిన ఆమెకు ఈ రిజర్వేషన్ అనుకూలించలేదు. ఈ మండలంలోనూ జెడ్పీటీసీ, ఎంపీపీ ఇద్దరు మాజీలు కానున్నారు. తాంసి జెడ్పీటీసీగా పులి శ్రీలత నారాయణ వ్యవహరిస్తుండగా, ఈసారి రిజర్వేషన్ జనరల్ రావడంతో టీఆర్ఎస్ నుంచి పోటీ తీవ్రంగా ఉండడంతో తాటిపెల్లి రాజుకు టిక్కెట్ ఇచ్చారు.
ఎంపీపీ మంజుల శ్రీధర్రెడ్డి ఉండగా, ఎంపీటీసీ స్థానం బండల్నాగాపూర్ ఈసారి కూడా జనరల్(మహిళ) రిజర్వేషన్ రావడం, ఇటు ఎంపీపీ జనరల్(మహిళ) రిజర్వేషన్ ఉండడంతో ఆమె మరోసారి అధికార పార్టీ నుంచి బరిలోకి దిగారు. తలమడుగు జెడ్పీటీసీ జక్కుల గంగమ్మ ఈసారి బరిలో నిలవలేదు. ఈ జెడ్పీటీసీ స్థానం జనరల్ రిజర్వ్ కావడం, పోటీ అధికంగా ఉండడంతో ఆమెకు టీఆర్ఎస్ నుంచి అవకాశం దక్కలేదు.
ఎంపీపీ రాము ఎంపీటీసీ స్థానం ఝరి కాగా, ఈసారి ఎస్టీ(జనరల్) రిజర్వ్ అయింది. అయితే రాము టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో దిగలేదు. ఇచ్చోడ జెడ్పీటీసీ సోన్కాంబ్లే రేణుక కాగా ఈసారి రిజర్వేషన్ జనరల్(మహిళ) రావడం, అధికార పార్టీ నుంచి పోటీ అధికంగా ఉండడంతో ఆమె బరిలో నిలవలేదు. ఎంపీపీ అమీనాబి ఎంపీటీసీ స్థానం గుండాల కాగా ఇక్కడ రిజర్వేషన్ జనరల్ వచ్చినా ఆమె బరిలో నిలవలేదు.