సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై చర్చించేందుకు సమావేశమైన కేంద్ర మంత్రిమండలి భేటీ ముగిసింది. కశ్మీర్ వ్యవహారాలు, ప్రస్తుత పరిస్థితిపై కేబినెట్ చర్చించింది. అయితే దీనిపై పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించి, కీలక ప్రకటన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తొలుత రాజ్యసభలో అమిత్ షా మాట్లాడనున్నారు. అనంతరం 12 గంటలకు లోక్సభలో కశ్మీర్ అంశంపై ప్రకటన చేయనున్నారు. మంత్రి మండలిలో చర్చించిన అంశాలు, కశ్మీర్ కల్లోలంపై పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులకు వివరించనున్నారు. దీని కోసం ఇప్పటికే అమిత్ షా పార్లమెంట్కు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో హోంమంత్రి ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు కశ్మీర్ కల్లోలంపై చర్చించేందుకు సమావేశమైన కేంద్రమంత్రి మండలి భేటీ ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ భేటీకి మంత్రివర్గ సభ్యులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అధికారులు పాల్గొన్నారు. అక్కడి పరిస్థితిపై ఆర్మీ, కేంద్రహోంశాఖ అధికారులు మంత్రివర్గానికి వివరించారు.